తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 గంటల నుంచి.. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 8వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సెప్టెంబర్ ఏడో తేదీన వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ ప్రకటించింది. అలాగే సెప్టెంబర్ 8వ తేదీ నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది.
మరోవైపు సెప్టెంబర్ 7న శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయాన్ని కూడా మార్పులు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు సెప్టెంబర్ 16న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15వ తేదీ వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి టాటా ఏస్ వాహనం విరాళంగా అందింది. తిరుపతికి చెందిన టాటా మోటార్స్ వరలక్ష్మీ ఆటో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.5.06 లక్షలు విలువైన టాటా ఏస్ ప్రో వాహనాన్ని విరాళంగా అందజేసింది. సంస్థ ప్రతినిధులు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి పూజలు నిర్వహించి.. ఆలయ సిబ్బందికి వాహనం తాళాలు అందజేశారు.
మరోవైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ అంకురార్పణతో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa