జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో దారుణం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కోసం ఒక మహిళ తన భర్తను, 22 ఏళ్ల కూతురిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి సినీ ఫక్కీలో నరబలి డ్రామా కూడా ఆడినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే... వడితల గ్రామానికి చెందిన కవిత భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఇదే సమయంలో కవిత అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తన భర్తకు తెలిసిపోతుందని భయపడిన కవిత.. ప్రియుడితో కలిసి జూన్ 25న భర్తను చంపింది. అనంతరం గుండెపోటుతో అతడు చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. కొంతకాలం తర్వాత తన వివాహేతర సంబంధం గురించి కూతురు వర్షిణి (22)కి కూడా తెలుస్తుందని అనుమానించిన కవిత.. ఆమెను కూడా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి వర్షిణిని చంపి ఆమె మృతదేహాన్ని భూపాలపల్లి-కాటారం హైవే పక్కన అడవిలో పడేసింది.
నరబలిగా చిత్రీకరించే ప్రయత్నం
పోలీసులను తప్పుదోవ పట్టించడానికి కవిత ఒక పథకం వేసింది. కూతురి మృతదేహాన్ని పడేసిన చోట చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి, మృతదేహం పక్కన వర్షిణి ఆధార్ కార్డు పెట్టింది. ఇది క్షుద్రపూజలు చేసి నరబలి ఇచ్చినట్లుగా కనిపించేలా చేసింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు కవిత తీరుపై అనుమానం కలిగింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. దారుణమైన నిజాలు బయటపడ్డాయి.
విచారణలో కవిత రెండు నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకుంది. అంతేకాకుండా ఆమె మరో హత్యకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తేలింది. ఈ హత్యల వెనుక కవితకు ప్రియుడిపై మోజు, ఆస్తిపై ఉన్న ఆశ కూడా ఒక కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కవితను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa