దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు మన సూచీలకు కొత్త జోష్ ఇచ్చాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న బలమైన అంచనాలు, భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ మొదలుకావడం వంటి అంశాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ను బలపరిచాయి. ఫలితంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 594.95 పాయింట్లు ఎగబాకి 82,380.69 వద్ద స్థిరపడింది. ఉదయం 81,852.11 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్, కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 82,443.48 వద్ద గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 169.90 పాయింట్లు లాభపడి 25,239.10 వద్ద ముగిసింది.అమెరికా ఫెడ్ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు, భారత్-యూఎస్ వాణిజ్య చర్చలపై నెలకొన్న ఆశావహ దృక్పథం మార్కెట్లకు ఊతమిచ్చాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. "కొత్త జీఎస్టీ రేట్లు, పండగ సీజన్ డిమాండ్ అంచనాలతో ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ మెరుగైన ప్రదర్శన కనబరిచాయి" అని ఆయన వివరించారు.ఈరోజు ట్రేడింగ్లో ఎఫ్ఎంసీజీ రంగం మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ ఆటో సూచీ 1.44%, నిఫ్టీ ఐటీ 0.86%, నిఫ్టీ బ్యాంక్ 0.47% చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ షేర్లలో కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్&టీ, మారుతీ సుజుకీ, టాటా స్టీల్ వంటివి ప్రధానంగా లాభపడగా, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభాలతోనే ముగిశాయి.ఇదే సానుకూల ధోరణి కరెన్సీ మార్కెట్లోనూ కనిపించింది. డాలర్తో రూపాయి మారకం విలువ 0.13% బలపడి 88.05 వద్ద స్థిరపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa