ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దెబ్బకొట్టిన ఏఐ,,,అతిపెద్ద ఐటీ కంపెనీలో 11 వేల మంది అవుట్

business |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 10:37 PM

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కన్సల్టింగ్ సేవల సంస్థ.. ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అసెంచర్ సడెన్ షాక్ ఇచ్చింది. ఏకంగా 11 వేల మందికిపైగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులు ఇందులో ఉన్నట్లు స్పష్టం చేసింది. గురువారం రోజు ఈ కంపెనీ తన చివరి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. ఈ సందర్భంగానే లేఆఫ్స్‌పైనా ప్రకటన చేసిన సంస్థ.. రానున్న రోజుల్లో మరిన్ని లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది.


అసెంచర్ అనేది.. ఐర్లాండ్‌లోని డబ్లిన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లోనూ దాదాపు సగం మంది వరకు తమ ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ సెప్టెంబర్- ఆగస్ట్ ఆర్థిక సంవత్సరాన్ని ప్రకటిస్తుంటుంది. ఈ క్రమంలోనే జూన్- సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించగా.. అదే రోజున లేఆఫ్స్‌పైనా ప్రకటన చేసింది.


ఇటీవల ప్రధానంగా ఏఐ వినియోగంపై దృష్టి పెట్టిన ఈ సంస్థ.. ఏఐపై అంత పట్టులేని.. తిరిగి శిక్షణ ఇవ్వలేని ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా నైపుణ్యాలు అంతగాలేని వారిని కూడా తొలగిస్తోంది. ఇదే సమయంలో 865 మిలియన్ డాలర్ల విలువైన కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు కంపెనీ సీఈఓ జూలీ స్వీట్ వెల్లడించారు. 3 నెలల కిందట అసెంచర్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఏకంగా 7,91,000 మంది ఉండగా.. ఇప్పుడు ఆగస్ట్ చివరి నాటికి 7,79,000 కి పడిపోయినట్లు తెలిసింది. దీంతో వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలుస్తోంది.


ఇక అసెంచర్ లేఆఫ్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే మొదలవగా.. నవంబర్ వరకు కొనసాగుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. ఏకంగా బిలియన్ డాలర్లకుపైగా ఆదా అవుతుందని భావిస్తోంది. క్లయింట్ డిమాండ్‌కు అనుగుణంగా.. ఉన్న ఉద్యోగుల్లో ఏఐ ట్రైనింగ్ ఇచ్చి.. ఈ రంగంలో పుంజుకోవాలని ఆశిస్తోంది.


అసెంచర్ ఫలితాల విషయానికి వస్తే.. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం జూన్- ఆగస్ట్ ఇలా 3 నెలల్లో 17.60 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 7 శాతం ఎక్కువగా ఉంది. ఇది అంచనాల్ని మించిందనే తెలుస్తోంది. కొత్త బుకింగ్స్‌లోనూ కంపెనీ అదరగొట్టింది. సమీక్షా త్రైమాసికంలో ఈ ఆర్డర్ల విలువ 21.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఇటీవల ట్రంప్ సర్కార్.. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ విషయానికి వస్తే ఈ సంవత్సరం తొలి అర్ధభాగంలో 1568 H1B వీసాల్ని మంజూరు చేసిందంట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa