ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ సమస్యలున్న వారు అసలు బొప్పాయి తినకూడదు

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 10:13 PM

పండ్లలో బొప్పాయికి ఉన్న ప్రత్యేకతే వేరు. దీనికి సూపర్ ఫ్రూట్ అనే పేరు కూడా ఉంది. ఎన్నో విటమిన్స్, పోషకాలు ఇందులో ఉంటాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. జీర్ణ శక్తిని పెంచే ఎంజైమ్స్ ని విడుదల చేయడంలోనూ ఈ పండు ఎంతగానో తోడ్పడుతుంది. ఇమ్యూనిటీ విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ తో కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.


ఇక యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా చర్మం కూడా మెరిసిపోతుంది. ఇన్ని లాభాలున్న బొప్పాయిని అందరూ తినవచ్చు అనుకుంటారు. కానీ కొన్ని రకాల సమస్యలున్న వారు అసలు ఈ పండుని తినకూడదని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ సహా మరి కొన్ని అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మరి ఎవరు బొప్పాయి పండుని తినకూడదో వివరంగా తెలుసుకుందాం.


గర్భిణీలు


బహుశా ఈ విషయం అందరికీ తెలిసే ఉండవచ్చు. కడుపుతో ఉన్నప్పుడు పొరపాటున కూడా బొప్పాయి తినకూడదు అని పెద్దలు చెబుతుంటారు. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో వాళ్లకి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా ఈ జాగ్రత్త మాత్రం చెప్తారు. నిజంగానే గర్భంతో ఉన్న వారు బొప్పాయి తినకూడదు అని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందులో లాటెక్స్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు పపైన్ ఉంటుంది.


ఈ రెండూ గర్భసంచి కుచించుకుపోయేలా చేసే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల గర్భాశయంపై ఒత్తిడి పడడంతో పాటు త్వరగా కాన్పు అయ్యే అవకాశాలూ ఉంటాయి. అంతే కాదు. ప్రసవం సమయంలో కాంప్లికేషన్స్ కి అవకాశం ఉంటుంది. కడుపుతో ఉన్న వారు తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు పెద్దగా నష్టం ఉండకపోయినా ఎక్కువ మొత్తంలో మాత్రం అసలు తీసుకోకూడదు. అసలు పూర్తిగా ఈ పండుని అవాయిడ్ చేసి మిగతావి తినడం శ్రేయస్కరం.


గుండె సమస్యలున్న వారు


సాధారణంగా ఎవరైనా సరే బొప్పాయిని పుష్కలంగా తినవచ్చు. కానీ గుండె సంబంధిత సమస్యలున్న వారు మాత్రం కాస్త దూరం పెట్టడమే మంచిది. ముఖ్యంగా హార్ట్ బీట్ సరిగ్గా లేని వారు..ఇప్పటికే హార్ట్ స్ట్రోక్, అటాక్ లాంటివి వచ్చిన వారు కాస్త అవాయిడ్ చేయడం బెటర్ అని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. అందుకు కారణమేంటో తెలుసుకుందాం. బొప్పాయిలో సైనోజెనిక్ కంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఇవి హైడ్రోజన్ సైనైడ్ ని విడుదల చేస్తాయి. అయితే..మిగతా వారికి దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ కార్డియాక్ కండీషన్స్ ఉన్న వారిలో మాత్రం ఇది నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండె అనారోగ్యానికి వేసుకునే మందులపై ఇది రియాక్షన్ చూపిస్తుంది. ఫలితంగా మందులు సరిగ్గా పని చేయవు. గుండె సంబంధిత సమస్యలుండి ఇబ్బంది పడుతున్న వారు మాత్రం మీ డైట్ లో బొప్పాయిని యాడ్ చేసుకునే ముందు ఓ సారి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.


అలెర్జీ ఉన్న వారు


ఇందాకే చెప్పుకున్నట్టుగా బొప్పాయిలో లాటెక్స్ ఉంటుంది. లాటెక్స్ అంటే..ఈ పండు నుంచి వచ్చే పాల లాంటి ద్రవం. అందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీన్ని మెడిసిన్స్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. పూర్తిగా పండిన బొప్పాయిలో ఈ లాటెక్స్ తక్కువగా ఉంటుంది. కాస్త పచ్చిగా ఉండే వాటిలో మాత్రం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే..లాటెక్స్ అందరికీ పడకపోవచ్చు. కొంత మందికి లాటెక్స్ వల్ల ఓ రకమైన అలెర్జీ వస్తుంది. దురదతో రియాక్షన్ మొదలవుతుంది. అప్పటి నుంచి రకరకాల సమస్యలు వస్తాయి. విపరీతంగా తుమ్ములు రావడం, శ్వాసకోశ సమస్యలు రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే..ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇప్పటికే ఎప్పుడైనా బొప్పాయి తినడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వాళ్లు వీలైనంత వరకూ ఈ పండుని అవాయిడ్ చేయడమే మంచిది. తినడం వల్ల మళ్లీ ఆ లక్షణాలు తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది.


థైరాయిడ్ ఉన్న వారు


ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సమస్య పెరుగుతోంది. దీని బారిన చాలా మంది పడుతున్నారు. ముఖ్యంగా హైపో థైరాయిడ్ ఉంటోంది. అంటే..థైరాయిడ్ హార్మోన్ అవసరమైన దాని కన్నా తక్కువగా విడుదల కావడం. దీని కోసం రకరకాల మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ఇలా మందులు వాడుతున్న వారు బొప్పాయి తినకపోవడమే మంచిది. ఎందుకంటే బొప్పాయిలో ఉండే గుణాలు థైరాయిడ్ హార్మోన్ పని తీరుపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా విపరీతమైన నీరసం, మెటబాలిజంలో మార్పులు, తీవ్ర జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపో థైరాయిడ్ ఉన్న వాళ్లు డాక్టర్ల సలహా లేకుండా రెగ్యులర్ గా బొప్పాయి తినడం ఏ మాత్రం మంచిది కాదు. అందుకే ముందుగానే వైద్యుల సలహా తీసుకుని అప్పుడు ఈ పండు తినాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవడం మంచిది.


కిడ్నీలో రాళ్లుంటే..


బొప్పాయిలో విటమిన్ సి అధకంగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే..కిడ్నీలో రాళ్లు ఉన్న వారు మాత్రం వీలైనంత వరకూ ఈ పండు తినకపోవడమే మంచిది. విటమిన్ సి ఎక్కువైనప్పుడు అది ఆక్సలేట్స్ గా రూపాతంరం చెందుతుంది. ఇది శరీరంలో ఉండే క్యాల్షియంతో కలిసి క్రిస్టల్ లా ఏర్పడుతుంది. ఇవే కిడ్నీలలో రాళ్లలా తయారవుతాయి. అందుకే కిడ్నీలో రాళ్లు ఉండి ఇబ్బందులు పడుతున్న వారు అసలు బొప్పాయి తినకూడదని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ హెచ్చరించింది. బొప్పాయిలో పోషకాలున్న మాట నిజమే అయినప్పటికీ ఇప్పుడు చెప్పిన వాళ్లంతా వీలైనంత వరకూ ఈ పండు తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa