ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్ 1బీ వీసాపై వెళ్లి అమెరికా టెక్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న భారతీయులు

international |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 10:52 PM

ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో హెచ్-1బీ వీసా నిబంధనలు, ఫీజుల పెంపు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే భారతీయ మేధావులు అమెరికాకు వెళ్లడానికి.. అక్కడ సక్సెస్‌ఫుల్ అయి.. పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా మారడానికి వారు మొదట ఈ హెచ్ 1బీ వీసానే తొలి మెట్టుగా నిలిచింది. ఈ హెచ్-1బీ వీసా కేవలం ఒక తాత్కాలిక ఉద్యోగ పత్రం మాత్రమే కాదని.. ప్రపంచ టెక్ దిగ్గజాలకు మన భారతీయ ప్రతిభను అందించే ఒక బంగారు మార్గమని ఇప్పటికే రుజువైంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాల సీఈఓ కుర్చీల్లో ప్రస్తుతం.. తెలుగు, తమిళ గడ్డపై పుట్టినవారు కూర్చుంటున్నారు. వారి విజయ ప్రస్థానం హెచ్-1బీ వీసాతోనే మొదలు కావడం గమనార్హం.


హెచ్-1బీ వీసాతో వెళ్లి అగ్రస్థానానికి చేరిన టెక్ దిగ్గజాలు


హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలో అడుగుపెట్టి.. తమ నైపుణ్యాలు, పనితీరు, అంకితభావంతో ప్రపంచ టెక్ సామ్రాజ్యాలనే పలువురు భారతీయులు శాసిస్తున్నారు.


సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ)


హైదరాబాద్‌లో పుట్టిన సత్య నాదెళ్ల.. హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌కు ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ సాధించిన విప్లవాత్మక మార్పులు చరిత్రలో నిలిచాయి. నైపుణ్యం గల వలసదారులే అమెరికాలో ఆవిష్కరణకు మూలమని సత్య నాదెళ్ల తరచుగా గట్టిగా వాదిస్తారు.


సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్/గూగుల్ సీఈఓ)


తమిళనాడులోని మదురై నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన సుందర్ పిచాయ్.. హెచ్-1బీ వీసాతోనే గూగుల్‌ కంపెనీలో అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే గూగుల్ కంపెనీలో అంచెలంచెలుగా ఎదిగిన సుందర్ పిచాయ్.. ప్రస్తుతం గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు.


అరవింద్ కృష్ణ (ఐబీఎం సీఈఓ)


ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌కు చెందిన అరవింద్ కృష్ణ.. హెచ్-1బీ వీసా ద్వారానే తన అమెరికా ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మరో టెక్ దిగ్గజం అయిన ఐబీఎంకు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షిస్తేనే ఆవిష్కరణలు సాధ్యం అవుతాయని ఆయన బలంగా విశ్వసిస్తారు.


జయశ్రీ ఉల్లాల్ (అరిస్టా నెట్‌వర్క్స్ సీఈఓ)


16 ఏళ్లకే అమెరికా వెళ్లిన జయశ్రీ ఉల్లాల్.. హెచ్-1బీ ద్వారా పలు టాప్ టెక్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం నెట్‌వర్కింగ్ దిగ్గజం అరిస్టా నెట్‌వర్క్స్‌కు జయశ్రీ ఉల్లాల్ సీఈఓగా పనిచేస్తున్నారు.


అరవింద్ శ్రీనివాస్ (పర్‌ప్లెక్సిటీ ఏఐ ఫౌండర్)


ప్రస్తుత ఏఐ యుగంలో భవిష్యత్తును శాసించబోయే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న పర్‌ప్లెక్సిటీ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన అరవింద్ శ్రీనివాస్ కూడా హెచ్-1బీ వీసా ద్వారానే అమెరికాలో అడుగుపెట్టారు. అమెరికాలో ఆవిష్కరణకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన నిరూపించారు.


హెచ్-1బీ ఆవిష్కరణకు, ఆర్థిక వృద్ధికి కీలకం


ఈ టెక్ దిగ్గజాలు అందరి ప్రస్థానం హెచ్-1బీ వీసాతోనే మొదలైంది. అందుకే.. ఈ హెచ్-1బీ వీసాలు అంటే కేవలం ఒక తాత్కాలికంగా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఒక అనుమతి పత్రం మాత్రమే కాకుండా.. భారతీయ ప్రతిభను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పే విధంగా మారింది. హెచ్-1బీ వీసాతో తమ అమెరికా కెరీర్‌ను ప్రారంభించిన ఎంతోమంది టెకీలు, నిపుణులు.. అమెరికా టెక్నాలజీ నాయకత్వాన్ని, ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేశారు. అందుకే ఏటా అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో 70 శాతానికి పైగా భారతీయులే దక్కించుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాతే.. హెచ్ 1బీ వీసా ఫీజులు పెంచడం, నిబంధనలు మరింత కఠినతరం చేయడం వంటి చర్యలు అమెరికా ఆవిష్కరణ శక్తిని దెబ్బతీస్తాయని అక్కడి టెక్ దిగ్గజాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa