టెక్ దిగ్గజం గూగుల్ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ను భారత్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటుచేస్తోంది. విశాఖపట్నం నగరంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం, గూగుల్ మధ్య అక్టోబరు 14న (మంగళవారం) ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. విశాఖలో ఏఐ డేటా సెంటర్ గురించి ప్రణాళికను పంచుకున్నారు. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటుచేస్తోన్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదేనని ఆయన తెలిపారు.
గూగుల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే ఐదేళ్లలో గూగుల్ సంస్థ భారత్లో 15 బిలియన్ డాలర్లు (అంటే రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. విశాఖలో భారీ డేటా సెంటర్, కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇది అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద AI హబ్గా నిలవనుంది. దీనిని చారిత్రాత్మక పరిణామంగా పేర్కొన్న పిచాయ్.. ఈ హబ్లో గిగావాట్ స్థాయి కంప్యూట్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సముద్ర అంతర్భాగ గేట్వే, విస్తృత స్థాయి ఇంధన మౌలిక సౌకర్యాలు కలిపి ఉంటాయని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా ఇది నిలవనుంది.
‘‘దీని ద్వారా మేము టెక్ పరిశ్రమలో అత్యంత నాణ్యమైన ఉన్న సాంకేతికతను భారత్లోని సంస్థలకు, వినియోగదారులకు అందించబోతున్నాం. ఇది దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణను వేగవంతం చేసి, వృద్ధికి దోహదం చేస్తుంది’’ అని పిచాయ్ తెలిపారు. గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిన కొద్ది సేపటికే ‘ఎక్స్ (ట్విట్టర్)’లో పిచాయ్ పోస్టు చేశారు. భారత్లో ఇప్పటి వరకు గూగుల్ పెట్టిన భారీ పెట్టుబడి ఇదే. ఏఐ-ఆధారిత సేవల విస్తరణను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వ వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఉంది అని గూగుల్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఇక, విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుచేస్తోన్న డేటా సెంటర్లో అదానీ గ్రూప్ కూడా భాగస్వామి కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1.88 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. అలాగే, ఏటా ఏపీ స్థూల ఉత్పత్తికి ఈ డేటా సెంటర్ ద్వారా రూ.10,518 కోట్ల సమకూరుతుందనే అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఏపీ ఐటీ రంగం స్వరూపమే మారిపోతుంది. సాగర నగరం విశాఖ దేశానికి ఏఐ హబ్గా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సహాకాలు, తక్కువ ధరకే భూములను గూగుల్ సంస్థకు కేటాయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa