ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓబీసీలకు 14 నుంచి 27 శాతానికి రిజర్వేషన్ల పెంపు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్

national |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 10:11 PM

మధ్యప్రదేశ్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ను 14 శాతం నుంచి 27 శాతానికి పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన 15 వేల పేజీల అఫిడవిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒకవైపు ప్రాచీన భారతదేశాన్ని కుల రహిత, ప్రతిభ ఆధారిత సమాజంగా కీర్తిస్తుంటే.. మరోవైపు మధ్యప్రదేశ్‌లో కులం ఆధారిత వివక్ష ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలిపే దిగ్భ్రాంతికరమైన విషయాలను ఆ అఫిడవిట్ వెలుగులోకి తీసుకువచ్చింది. అందుకే రిజర్వేషన్లలో సంస్కరణలు తీసుకురావాలని.. దానికి సంబంధించిన ప్రతిపాదనలను మోహన్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.


సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదాన్ని సమర్థిస్తూ.. ఈ రిజర్వేషన్ల పెంపును తీసుకువస్తున్నట్లు తెలిపిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. ఇది దేశ నిర్మాణంలో భాగమని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ను 27 శాతానికి పెంచడానికి అనుకూలంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 2023లో నిర్వహించిన రహస్య సర్వేకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇక మధ్యప్రదేశ్‌లో కుల వివక్ష ఏ స్థాయిలో ఉందో ఈ నివేదిక బట్టబయలు చేసింది.


ఇక అంబేద్కర్ యూనివర్సిటీ.. సర్వే చేసిన దాదాపు 10 వేల కుటుంబాల్లో 5578 కుటుంబాలు (దాదాపు 56 శాతం).. అగ్రకులాలకు చెందిన వ్యక్తులు.. తమ ఇంటి ముందు నుంచి వెళ్తున్నపుడు వారికి గౌరవం ఇచ్చేలా మంచం లేదా వేదికపై కూర్చోకుండా లేచి నిలబడాల్సి వస్తుందని అంగీకరించాయి. 3,797 కుటుంబాలు తమ గ్రామాల్లో అంటరానితనం ఇంకా కొనసాగుతోందని.. అగ్రకులాల నుంచి వేరుగా ఉంచడానికి నిమ్న కులాలకు నిర్దిష్టమైన ప్రాంతాలు ఉన్నాయని తెలిపాయి.


ఇక 3,763 కుటుంబాలు అగ్రకులస్తులు తమతో కలిసి భోజనం చేయరని.. 3,238 కుటుంబాలు కులం పేరు చెప్పి తమ ఇళ్లలో మతపరమైన పూజలు చేయడానికి పూజారులు నిరాకరిస్తారని ఈ నివేదికలు వెల్లడైంది. 57 శాతం కుటుంబాలు తమ కులానికి చెందిన వారిని దేవాలయాల్లో పూజారులుగా లేదా ఆశ్రమాలకు అధిపతులుగా నియమించరని తెలిపాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 76 శాతానికి పైగా 12వ తరగతికి మించి చదవలేదని వెల్లడైంది. ఈ విద్యా, వృత్తిపరమైన తేడాలను.. ఆ నివేదిక దీర్ఘకాలిక పేదరికానికి ముడిపెట్టింది. దాదాపు 94 శాతం కుటుంబాలు అప్పులు తీసుకున్నాయని.. కేవలం 27 శాతం మంది మాత్రమే పక్కా ఇళ్లలో నివసిస్తున్నారని తేలింది. 50 శాతానికి పైగా ఓబీసీ కుటుంబాల్లో మహిళలు దినసరి కూలీలు లేదా వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారని.. దీంతో వారు అట్టడుగు వర్గంలోనే కొనసాగుతున్నారని పేర్కొన్నారు.


అయితే మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ సామాజిక, ఆర్థిక వివక్షను రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన సమగ్ర సంస్కరణలను తీసుకువచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో ప్రతిపాదించింది. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొంది. లడ్లీ బెహనా, లడ్లీ బేటీ వంటి సంక్షేమ పథకాల్లో ఓబీసీ మహిళలకు 50 శాతం కోటా కేటాయించాలని సిఫార్సు చేసింది. సామాజిక న్యాయం, లింగ వివక్షను వదిలేయకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేసింది.


ఇక రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఓబీసీలు ఉన్నప్పటికీ.. వారు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అసాధారణ పరిస్థితుల కారణంగానే రిజర్వేషన్‌ను 50 శాతం పరిమితికి మించి 27 శాతానికి పెంచాలని కోరుతున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa