ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసం రేపటి నుంచే ప్రారంభం! నవంబర్ 20 వరకు ఆధ్యాత్మిక శోభ

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 04:09 PM

నేటితో ఆశ్వయుజ మాసం ముగియగా, భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యంత పవిత్రమైన కార్తీక మాసం రేపటి, అంటే అక్టోబర్ 22 నుంచి మొదలుకానుంది. పరమేశ్వరుడికి, శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ మాసం నవంబర్ 20 వరకు కొనసాగనుంది. ఈ మాసంలో శివ కేశవులను విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ఆనవాయితీ. ఈ నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది.
మాసాలలో కార్తీక మాసానికి ఉన్న ప్రాధాన్యత గురించి స్కంద పురాణం ప్రత్యేకంగా పేర్కొంది. 'న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం' (కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు) అని కార్తీక మాసం యొక్క విశిష్టతను పురాణాలు చాటిచెప్తున్నాయి. ఈ పవిత్ర మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానాలు ఆచరించి, దీపారాధన చేయడం వలన అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉపవాస దీక్షలు, వ్రతాలు, పూజలు ఈ మాసమంతా నిష్టతో ఆచరిస్తారు.
కార్తీక మాసంలో శివాలయాలు, వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. శివ నామస్మరణతో ఆలయాలు మారుమోగుతాయి. ముఖ్యంగా సోమవారాలు, పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి వంటి పర్వదినాలలో భక్తులు మరింత నియమనిష్టలతో పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం వేళల్లో తులసి కోట వద్ద, ఉసిరి చెట్ల దగ్గర దీపాలు వెలిగించి, దీపారాధన చేయడం ఈ మాసంలో అతి ముఖ్యమైన ఆచారం.
ఒక్క నెల రోజుల పాటు జరిగే ఈ కార్తీక వ్రతం భక్తికి, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక. ప్రజలు తమ ఇళ్లలో, దేవాలయాలలో నిత్యం పూజలు చేయడంతో పాటు, బంధుమిత్రులతో కలిసి ఉసిరి వృక్షం (ధాత్రి వనం) కింద వనభోజనాలు నిర్వహించి, ప్రకృతిని, దైవాన్ని ఆరాధిస్తారు. ఈ నెల రోజుల భక్తి పారవశ్యం భక్తుల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి, వారికి ఆరోగ్యం, సుఖసంతోషాలను, మోక్షాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa