ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మీ అమ్మ నిర్ణయించింది': జర్నలిస్టుకు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ తిక్క సమాధానం

international |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 07:23 PM

ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరగనున్న శిఖరాగ్ర సమావేశంపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అంతకుముందు అలాస్కాలో భేటీ అయిన ఈ ఇద్దరు నాయకులు.. ఈసారి ఐరోపాలోని హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో సమావేశం కానున్నారు. ఈక్రమంలోనే దీని వేదిక ఎంపిక గురించి ఒక విలేకరి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్‌కు ఒక సందేశం (మెసేజ్) పంపారు. బుడాపెస్ట్‌ను వేదికగా ఎవరు నిర్ణయించారని ఆ రిపోర్టర్ ప్రశ్నించగా.. లీవిట్ అసభ్యంగా మాట్లాడారు. ముఖ్యంగా "మీ అమ్మ నిర్ణయించింది" అంటూ బదులిచ్చారు. శ్వేతసౌధం ప్రెస్ సక్రటరీ వంటి అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక అధికారి ఈ విధంగా అభ్యంతరకర భాషను ఉపయోగించడంతో కరోలిన్ లీవిట్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.


ముఖ్యంగా కరోలిన్ లీవిట్ మీ అమ్మ నిర్ణయించిందంటూ సమాధానం ఇచ్చి ఆగకుండా.. ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారు. సదరు విలేకరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ రిపోర్టర్‌ను వాస్తవాలపై ఆసక్తి ఉన్న జర్నలిస్టు కాడని చెప్పారు. అలాగే కేవలం ఓ 'వామపక్ష హ్యాకర్'గా అభివర్ణించారు. అనేక సంవత్సరాలుగా అతను ట్రంప్‌నకు వ్యతిరేకంగా నిరంతరం వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నిజమైన రిపోర్టర్లుగా నటిస్తూ తిరిగే ఇలాంటిటి డెమోక్రటిక్ కార్యకర్తలు.. తమ వృత్తికి, ముఖ్యంగా జర్నలిజం విలువలకు చెడ్డపేరు తెస్తున్నారని కరోలిన్ లీవిట్ విమర్శించారు. తన వాదనకు మద్దతుగా ఈ సంభాషణకు సంబంధించిన పలు స్క్రీన్‌షాట్లను కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.


బుడాపెస్ట్‌లో జరగనున్న ఈ ట్రంప్-పుతిన్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి వైట్ హౌస్ ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించనప్పటికీ.. మరో రెండు వారాలలో ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈక్రమంలోనే ఈ సమావేశంపై పెద్ద ఎత్తున ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ సమావేశమైనప్పుడు.. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి పుతిన్ ప్రతిపాదించినట్లుగా దొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని జెలెన్‌స్కీపై ట్రంప్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపింది.


ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పుతిన్, ట్రంప్ మధ్య జరగనున్న చర్చలు మరింత వాడీవేడిగా, ఉద్రిక్తంగా సాగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంలో ఈ భేటీ కీలక పాత్ర పోషించనుండటం వల్ల దీన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. లీవిట్ చేసిన వ్యాఖ్యలు, రిపోర్టర్‌పై చేసిన విమర్శలు ఈ సమావేశం చుట్టూ ఉన్న రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa