ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఈరోజే మోదీతో ఫోన్‌లో మాట్లాడా.. రష్యా నుంచి భారీగా చమురు కొనమని చెప్పారు': ట్రంప్

international |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:46 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై, ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల సందర్భంగా ఆయన ఈ కామెంట్లు చేశారు. ఇందాకే నేను ప్రధాని మోదీతో మాట్లాడానని చెప్పిన ఆయన.. భారత్ ఇకపై రష్యా నుంచి పెద్దగా చమురు కొనుగోలు చేయబోదని అన్నారు. రెండు మూడు రోజుల క్రితమే భారత్ పూర్తిగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గిస్తోందని.. మోదీ తనకు హామీ కూడా ఇచ్చారని చెప్పిన ట్రంప్ తాజాగా అదే రకమైన కామెంట్లు చేయడంతో అంతా అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు.


మంగళవారం రోజు వైట్‌హైస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో ట్రంప్ సహా పలువురు కీలక అధికారులు పాల్గొని సందడి చేశారు. ముందుగా భారతీయ అమెరికన్లు అందరికీ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగానే మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. తాను ఈ రోజు ప్రధాని మోదీతో మాట్లాడానని చెప్పారు. తమ ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇకపై ఆయన రష్యా నుంచి పెద్దగా ఆయిల్ కొనుగోలు చేయబోరని పునరుద్ధాటించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియాలని నేను ఎంతగా కోరుకుంటున్నానో.. మోదీ కూడా అంతే కోరుకుంటున్నారని అన్నారు.


 వారు మరీ ఎక్కువగా చమురు కొనడం మానేస్తారు.. రష్యా కూడా యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే భారత్ భారీగా చమురు కొనుగోళ్లను తగ్గించిందని.. మున్ముందు మరింతగా తగ్గిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించనప్పటికీ.. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ట్రంప్‌కు ఫోన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.


గతంలో కూడా ట్రంప్ ఇలాంటి కామెంట్లే చేయగా.. న్యూఢిల్లీ ఆ వ్యాఖ్యలను గట్టిగా తిరస్కరించింది. "భారత్ ఆయిల్, గ్యాస్ ముఖ్యమైన దిగుమతిదారు. అస్థిరంగా ఉన్న ఇంధన పరిస్థితులలో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా స్థిరమైన ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ద్వారానే నిర్దేశించబడతాయి" అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తమ ఇంధన విధానాలు కేవలం దేశ అవసరాలు, వినియోగదారుల ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటాయని భారత్ తేల్చి చెప్పింది.


భారతదేశానికి సంబంధించిన అంశాలతో పాటు చైనాపై సుంకాల గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమతో చైనా నవంబర్ 1వ తేదీ వరకు ఒప్పందం కుదుర్చుకోకపోతే.. ప్రస్తుతం 55 శాతం ఉన్న సుంకాలను 155 శాతానికి పెంచుతామని హెచ్చరించారు. చైనాతో తాను స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నానని చెబుతూనే.. తమపై ఆధిపత్యం చెలాయించాలని, అమెరికాను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


అంతటితో ఆగకుండా తాను యూరోపియన్ యూనియన్‌తో, జపాన్, దక్షిణ కొరియాలతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందాలు చాలావరకు గొప్పవని.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. సుంకాల కారణంగానే తాను ఇది చేయగలిగానిన.. దీని ద్వారా అమెరికాకు వందల బిలియన్లు, ట్రిలియన్ల డాలర్లు వస్తున్నాయని ట్రంప్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa