ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయ యాత్రికులను బోర్డర్‌‌లో షాకిచ్చిన పాకిస్థాన్

national |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 09:03 PM

గురు నానక్ దేవ్ జీ జన్మదినం సందర్భంగా పాకిస్థాన్‌లోని నన్కానా సాహిబ్‌కు యాత్రకు వెళ్లిన భక్తుల బృందంలో మతపరమైన వివక్ష చూపిన సంఘటన సంచలనం సృష్టించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లిన తొలి సిక్కు యాత్ర ఇదే కాగా.. పాకిస్థాన్ అధికారులు హిందూ యాత్రికులను సరిహద్దు దాటడానికి అనుమతించలేదు. వాఘా సరిహద్దు వద్ద హిందూ యాత్రికులు ఇమ్మిగ్రేషన్, ప్రయాణ లాంఛనాలన్నింటినీ పూర్తి చేసినప్పటికీ.. వారిని చివరి నిమిషంలో ఆపివేయడం భారతీయ అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది.


మీరు హిందువులు.. వెళ్లడానికి వీళ్లేదు


ఢిల్లీకి చెందిన అమర్ చంద్ అనే యాత్రికుడు తన కుటుంబ సభ్యులు ఏడుగురితో సహా యాత్రకు వెళ్లారు. "మేము అట్టారి అంతర్జాతీయ సరిహద్దు దాటి వాఘాకు చేరుకుని ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు పూర్తి చేశాం. ప్రత్యేక బస్సు టిక్కెట్లు కూడా కొనుగోలు చేశాము. సరిగ్గా బస్సు ఎక్కబోతున్న సమయంలో అధికారులు మమ్మల్ని ఆపేశారు. మీరు హిందువులు.. సిక్కులతో కలిసి వెళ్లడానికి వీల్లేదని పాకిస్థాన్ అధికారులు తమకు చెప్పినట్లు అమర్ చంద్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్నోకు చెందిన ఏడుగురితో కూడిన మరో బృందాన్ని కూడా అధికారులు వెనక్కి పంపారు.


ఈ 10 రోజుల యాత్ర కోసం పాకిస్థాన్ హైకమిషన్ 2,100 మందికి పైగా భక్తులకు వీసాలు మంజూరు చేసినప్పటికీ.. కేవలం 1,796 మంది మాత్రమే సరిహద్దు దాటగలిగారు. సుమారు 300 మందికి పైగా భక్తులు ప్రోటోకాల్ పాటించనందున నిలిచిపోయారు. అయితే హిందువులను మత ప్రాతిపదికన ఆపడం తీవ్ర చర్చనీయాంశమైంది. మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.


అయితే ఈ మతపరమైన విభజన.. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత ఇస్లామాబాద్ ఉద్దేశపూర్వకంగా విభేదాలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నంగా అంతా భావిస్తున్నారు. ఈ చర్యతో సిక్కులు, హిందువుల మధ్య అంతరాలు సృష్టించాలని పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని యాత్రికులు, నిఘా వర్గాల అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు వెళ్లే భక్తులకు వ్యతిరేకంగా కూడా పాకిస్థాన్ ఇలాగే వ్యవహరించవచ్చని ఒక నిఘా అధికారి హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ జరిగినప్పటి నుంచి కర్తార్‌పూర్ కారిడార్ మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa