కుమారుడు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబానికి అతడి మృతదేహం దొరికింది. అది చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుండెల నిండా బాధతోనే.. అతడికి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత బంధువులు ఇంటికొచ్చి చనిపోయాడనుకుంటున్న మీ కుమారుడు మరో చోట కనిపించాడని చెప్పగా.. ఆనందంతో అక్కడికి పరుగులు పెట్టారు. వెళ్లి చూడగా.. నిజంగానే తమ కుమారుడు కనిపించాడు. అతడిని హత్తుకుని ముద్దులతో ముంచెత్తిన తల్లిదండ్రులు.. మరి తాము అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎవరా అని ఆలోచనలో పడ్డారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని సూరజ్పుర్ జిల్లాలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
అంత్యక్రియలు పూర్తి.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
ఛత్తీస్గఢ్లోని సూరజ్పుర్ జిల్లా చందర్పుర్కు చెందిన 25 ఏళ్ల పురుషోత్తం రెండు రోజులపాటు కనిపించకుండా పోయాడు. కుమారుడి ఆచూకీ తెలియక అతని కుటుంబం తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మన్పుర్ ప్రాంతంలోని ఓ బావిలో దొరికిన మృతదేహాన్ని పోలీసులు పురుషోత్తం కుటుంబ సభ్యులకు చూపించారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు.. ఆ మృతదేహం పురుషోత్తందే అని భావించి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత వారు సాంప్రదాయబద్ధంగా అన్ని అంత్యక్రియల కార్యక్రమాలను నిర్వహించి.. అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.
ఈ విషాదకర ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాతే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. బంధువుల కుమారుడి మరణ వార్త విని ఇంటికి వచ్చిన వారు పురుషోత్తంను తాము అంబికాపుర్లో చూసినట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు. తమ దుఃఖం సంతోషంగా మారడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. బంధువులు చెప్పిన ప్రకారం.. సూరజ్పుర్ నుంచి సుమారు 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న అంబికాపుర్కు వెళ్లి.. అక్కడ బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్న పురుషోత్తంను మంగళవారం గ్రామానికి తిరిగి తీసుకువచ్చారు.
చనిపోయాడనుకున్న కొడుకు ఇంటికి తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారం రోజుల వ్యవధిలో ఆ కుటుంబం తీవ్ర దుఃఖాన్ని.. ఆ తర్వాత అత్యంత అద్భుతమైన సంతోషాన్ని చవిచూసింది. అయితే తమ కుమారుడు ఇంటికి తిరిగొచ్చిన తర్వాతే తాము అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎవరనేది ప్రశ్నగా మారింది. దీంతో వెంటనే పురుషోత్తం కుటుంబ సభ్యులు పోలీసుల వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ మిస్టేకెన్ ఐడెంటిటీ కేసుపై ఏఎస్పీ సంతోష్ మహతో స్పందిస్తూ.. "కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ కుమారుడిదిగా గుర్తించారు. దానికి అంత్యక్రియలు కూడా చేశారు. ఇప్పుడు పురుషోత్తం బతికి ఇంటికి వచ్చాడు. కాబట్టి ఆ మృతదేహం ఎవరిదై ఉంటుందనే కోణంలో మేము కొత్తగా విచారణ ప్రారంభించాం. దానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తాం" అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa