ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలోకి చొరబాటుదారులు వస్తుంటే అది ప్రభుత్వ వైఫల్యమేనని వ్యాఖ్య

national |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 01:43 PM

ప్రతిపక్షాలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్న బీజేపీ ఆరోపణలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ దేశంలోకి చొరబాటుదారులు వస్తున్నారంటే, అది పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీశ్ కుమార్ దీనికి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ముందు కిషన్‌గంజ్‌లో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి మీవాడే, కేంద్ర హోంమంత్రి మీవాడే, ప్రధాని కూడా మీరే. మీ కళ్లెదుటే చొరబాటుదారులు ఎలా వస్తున్నారు ఒకవేళ వారు వస్తున్నారంటే అది మీ పరిపాలనా వైఫల్యమే కదా మీ చేతుల్లో బీఎస్ఎఫ్, సీమా సురక్షా బల్ ఉన్నాయి. అయినా చొరబాటులు జరుగుతున్నాయని మీరే ఆరోపిస్తున్నారు అని ఒవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు.చొరబాటుదారుల ఆరోపణను తిప్పికొడుతూ ఇక్కడేమైనా బంగారు గనులు దొరికాయా లేక చమురు నిక్షేపాలు బయటపడ్డాయా ప్రజలు గుంపులు గుంపులుగా వలస రావడానికి సీమాంచల్ ప్రాంత ముస్లింలు దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్‌కు వెళ్లకుండా భారత్‌నే తమ దేశంగా ఎంచుకున్నారు. వారిని ఇప్పుడు చొరబాటుదారులు అని నిందిస్తున్నారు. కనీసం 10 మంది చొరబాటుదారుల పేర్లయినా బీజేపీ చెప్పగలదా అని ఆయన సవాల్ విసిరారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింల కోసం ఏమీ చేయనందుకే, వారిని కించపరిచేలా బీజేపీ మాట్లాడుతోందని ఆరోపించారు.సీమాంచల్ ప్రాంత అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఒవైసీ విమర్శించారు.పాట్నా, దర్భంగా, భాగల్‌పూర్‌లలో ఎయిమ్స్, ఐఐటీలు కట్టామని ప్రధాని చెబుతారు. కానీ అరరియాలో ఏం చేశారో చెప్పలేరు. అందుకే ఇక్కడి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తోంది అని ఆయన పేర్కొన్నారు.ఓట్ల దొంగతనం జరుగుతోందన్న రాహుల్ గాంధీ ఆరోపణలపై మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలను చాలాసార్లు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఒవైసీ సూచించారు.మనం పోటీ పడుతోంది బీజేపీతో. కళ్లు మూసి తెరిచేలోపు మిమ్మల్ని మాయం చేయగలరు అని ఆయన వ్యాఖ్యానించారు.2020 బీహార్ ఎన్నికల్లో ఒవైసీ పార్టీ సీమాంచల్ ప్రాంతంలో 5 స్థానాలు గెలిచి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17% ముస్లిం జనాభాలో ఈ ప్రాంతంలోనే అధికశాతం ఉన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa