ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్టీలు కొట్టిన ఇన్నోవా కారు.. ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సురక్షితం

Crime |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 07:10 PM

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఇటీవల ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో నల్గొండ జిల్లాలో జరిగిన తాజా ప్రమాదంతో పాటు.. ఇటీవల వికారాబాద్, కర్నూలు జిల్లాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు ప్రమాద తీవ్రతను, రహదారి భద్రత లోపాలను మరోసారి ఎత్తిచూపుతున్నాయి. వాహన డ్రైవర్ల అతివేగం, అజాగ్రత్త విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత స్పష్టమవుతోంది.


నల్గొండ జిల్లా, చిట్యాల మండలం పరిధిలోని గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఇన్నోవా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న ఎనిమిది మంది ప్రయాణీకులు అప్రమత్తంగా బయటకు రావడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం ధాటికి ఇంజిన్‌లో మంటలు చెలరేగి ఇన్నోవా పూర్తిగా కాలి బూడిదైంది. దీంతో హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


నల్గొండ ఘటనలో ప్రయాణీకులు బయటపడినప్పటికీ.. గత కొద్ది రోజులుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పెను విషాదాలను మిగిల్చాయి. చేవెళ్ల వద్ద ఇటీవల టీఎస్ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో దాదాపు 19 మంది మృతి చెందారు. కొందరికి గాయాలు అయ్యాయి. మృతుల్లో తల్లి, బిడ్డ, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఉండటం హృదయ విదారకం. ఈ ప్రమాదంలో లారీ రాంగ్ రూట్లో ప్రయాణించడం, అతివేగం ప్రధాన కారణాలుగా గుర్తించారు. తెలంగాణ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వద్ద కూడా కొద్ది రోజుల క్రితం ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించి 21 మంది సజీవ దహనం కావడం రహదారి భద్రతపై ప్రశ్నార్థకాన్ని లేవనెత్తింది.


వరుస రోడ్డు ప్రమాదాలకు నిద్రలేమి డ్రైవింగ్, అతివేగం, ప్రమాదకరమైన ఓవర్‌టేకింగ్ , నిర్లక్ష్యం వంటి అంశాలే ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. వాహనదారులు, ప్రయాణీకులు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటి విషాదాలను నివారించడం సాధ్యమవుతుంది. రోడ్డు ప్రమాదాల్లో వాహన యజమానులను కూడా బాధ్యులను చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీని వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa