బిహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై (ఎస్ఐఆర్) నిర్వహించడంపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ రెండో దశను నిర్వహిస్తామని చెప్పింది. అందులో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. అయితే బెంగాల్ ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు తన గొంత కోసినా ఫర్వాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ప్రజలను వేధిస్తోందని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను ఎందుకింత హడావుడిగా నిర్వహిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. దీన్ని వెంటనే నిలిపేయాలని మమత డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు నోట్బందీ లాగానే.. ఎస్ఐఆర్ కూడా ఓట్బందీ అని ఎద్దేవా చేశారు. దేశంలో సూపర్ ఎమర్జెన్సీకి ఇది మరో రూపం అని ఘాటుగా విమర్శించారు.
నా గొంతు కోసినా సరే : మమత
ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు బీజేపీ వాళ్లు తనను జైలుకు పంపినా.. తన గొంతు కోసినా సరేనని సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఓటు హక్కు మాత్రం హరించొద్దని అన్నారు. అంతేకాకుండా జీఎస్టీ కూడా బీజేపీ చేసిన అతిపెద్ద తప్పు అని.. దాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందన్నారు.
ఇటీవల కూడా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి హెచ్చరికలు జారీ చేశారు మమతా బెనర్జీ. ఈ మేరకు నవంబర్ 4న కోల్కతాలో జరిగిన నిరసనలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వం వహించారు. కోల్కతా వీధుల్లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న మమత.. బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై చేస్తున్న నిశ్శబ్ధ రిగ్గింగ్గా ఎస్ఐఆర్ను అభివర్ణించారు. కాగా బిహార్లో ఎంతమంది రోహింగ్యాలు, బంగ్లాదేశీల వివరాలు లభించాయో ఎన్నికల సంఘం చెప్పాలని డిమాండ్ చేసిన మమత.. అర్హత కలిగిన ఒక్క ఓటర్ని అయినా ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తే.. బీజేపీ ప్రభుత్వం అంతు చూస్తామని ఘాటుగా హెచ్చిరించారు. కాగా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా.. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటీవల ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా 321 జిల్లాలు, 1843 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 51 కోట్ల మంది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రివిజన్ చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa