ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ పేలుడులో అసలు సూత్రధారి లేడీ డాక్టర్

national |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:38 PM

నవంబరు 10న హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ ఎత్తున్న పేలుడు పదార్థాలు లభ్యమైన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌కు చెందిన అదీల్ అహ్మద్ రథర్, ముజామిల్ షకీల్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో లక్నోకు చెందిన షహీనా షాహిద్ అనే మహిళా వైద్యురాలిని అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్‌లో మహిళా విభాగం ఏర్పాటు, నియామకాల్లో డాక్టర్ షహీనా కీలక పాత్ర పోషించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ షహీనాకు జైషే మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మొమినాత్’ భారత్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నాయి. పాక్‌లో ఈ విభాగానికి మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ చీఫ్‌గా వ్యవహరిస్తోంది. ఢిల్లీ పేలుడులో ఆమె కూడా కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.


అధికారులు తెలిపిన ప్రకారం డాక్టర్ షహీనా షాహీద్ లక్నోలోని లాల్ బాగ్‌కు చెందినవారు. ఫరీదాబాద్‌లోని జైషే ఉగ్ర కుట్ర భగ్నం చేసిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాడులకు నిధులు, ఉగ్రవాద ఆపరేషన్లను సులభతరం చేయడానికి కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు. షహీనాకు చెందిన కారులోనే ఏకే-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తోన్న షహీనాకు.. కశ్మీర్‌ డాక్టర్ ముజామిల్‌ గనాయ్‌ అలియాస్‌ ముసైబ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. ఫరీదాబాద్‌లో అతడు అద్దెకు తీసుకున్న రెండు గదుల నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు లభ్యం కావడం ముజామిల్‌ను అరెస్ట్ చేశారు.


జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో కోయిల్‌కు చెందిన ముజామిల్ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. శ్రీనగర్‌లో సైనికులను హెచ్చరిస్తూ జైషే మహమ్మద్‌‌కు మద్దతుగా పోస్టర్లు అతికించిన కేసులో జమ్మూ కశ్మీర్ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయడంలో ఉగ్రకుట్ర వెలుగులోకి వచ్చింది. రైఫిల్, పిస్టల్, పేలుడు పదార్థాలను దాచిపెట్టిన కారును షహీనాదిగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. విచారణలో అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా అమ్మోనియం నైట్రేట్‌గా భావిస్తోన్న 350 కిలోల పేలుడు సామాగ్రి, 20 టైమర్లు, ఇతరు అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.


ఇక, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో జైషే ఉగ్రవాద సంస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో తిరిగి తన ప్రభావాన్ని విస్తరించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ‘జమాత్ ఉల్ మొమినాత్’ పేరుతో తొలిసారి మహిళా విభాగం ఈ అక్టోబర్‌లో ఏర్పాటు చేసినట్లు సమాచారం.


నిఘా వర్గాల ప్రకారం ఈ కొత్త విభాగానికి నియామక ప్రక్రియ అక్టోబర్‌ 8న బహావల్పూర్‌లో ఉన్న మర్కజ్‌ ఉస్మాన్-ఓ-అలీ కేంద్రంలో మొదలైంది. దీనికి నేతృత్వం వహించేది మసూద్‌ అజ్హర్‌ సోదరి సాదియా అజ్హర్‌. ఈ సంస్థ, బహావల్పూర్‌, కరాచీ, ముజఫరాబాద్‌, కోట్లీ, హరిపూర్‌, మాన్సెహ్రాలో ఉన్న తమ విద్యా కేంద్రాల్లో అభ్యసిస్తున్న ఆర్థికంగా బలహీనమైన మహిళలను, అలాగే జైషే కమాండర్ల భార్యలను కూడా ఇందులో చేర్చుకుంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa