ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ పేలుడు అనుమానితుడు రాడికల్ డాక్టర్ల టెలిగ్రామ్ గ్రూప్‌లో సభ్యుడు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:41 PM

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో సంబంధాలు ఉన్న తీవ్రవాద వైద్యుల టెలిగ్రామ్‌ గ్రూప్‌‌‌లోని సభ్యుడైన డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఢిల్లీ పేలుడుకు ప్రధాన పాత్రధారిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడును ఆత్మాహుతి దాడిగా భావిస్తుండగా.. కారును నడిపిన వ్యక్తి ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో 1980 ఫిబ్రవరి 24న జన్మించిన ఉమర్.. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. శ్రీనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్‌లో పీజీ పూర్తిచేసి.. అనంత్‌నాగ్‌ జీఎంసీలో సీనియర్ రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఫరీదాబాద్‌కు బదిలీ అయ్యాడు.


సోమవారంఫరీదాబాద్‌లో అరెస్టైన ఇద్దరు వైద్యులు అదీల్ అహ్మద్ రథర్, ముజామిల్ షకీల్‌‌లకు ఉమర్‌ సన్నిహితుడు. తమ సన్నిహితులు అరెస్ట్ కావడంతో తాను కూడా దొరికిపోతాననే భయంతోనే కారు నడిపి ఆత్మాహుతికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ధ్వంసమైన కారులో శరీర భాగాలు, చేతి వేళ్లు లభ్యమయ్యాయి. ఆ మృతదేహం ఉమర్ మహమ్మద్‌కు చెందినదా? కాదా? అని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ అదీల్‌కు కూడా ఉమర్ సన్నిహితుడని, వీరిద్దరికీ టెలిగ్రామ్ యాప్‌లో చురుకుగా ఉండే రాడికల్ డాక్టర్ల గ్రూపుతో సంబంధం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.


సీసీటీవీ దృశ్యాలు, ఫోటోల ప్రకారం.. అనుమానితుడు ఉమర్‌ బదర్పూర్‌ బోర్డర్ నుంచి ఐ20 కారుతో ఢిల్లీలోకి ప్రవేశించి అశ్రమ్‌, సరాయి కాళేఖాన్‌, ఐటీఓ మార్గం గుండా ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ పార్కింగ్‌ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ దాదాపు 3 గంటలపాటు ఆ కారు అక్కడే ఉంది. మధ్యాహ్నం 3:19 గంటలకు ప్రవేశించి, సాయంత్రం 6:30కు బయలుదేరింది. అనంతరం కొద్ది నిమిషాల్లోనే సిగ్నల్ పాయింట్ వద్ద పేలుడు సంభవించింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఆ సమయంలో ఉమర్‌ ఒక్క నిమిషం కూడా కారులోంచి బయటకు రాలేదు.


ఉమర్‌తో పాటు తారిక్‌ అహ్మద్‌ మాలిక్‌, ఆమీర్‌ రషీద్‌, ఉమర్‌ రషీద్‌ అనే మరో ముగ్గురికి ఈ పేలుడుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురిని సోమవారం రాత్రి జమ్మూ కశ్మీర్‌లోని పాంపోర్‌‌లో అరెస్ట్‌ చేశారు. తారిక్‌, ఆమీర్‌లను శ్రీనగర్‌కు తరలించగా, ఉమర్‌ రషీద్‌ మాత్రం పాంపోర్‌లోనే ఉన్నాడు. కారును ఉమర్ మహమ్మద్‌కు అమీర్ ఇచ్చినట్టు విచారణలో వెల్లడయ్యింది. అమీర్ కారు తాళం పట్టుకుని ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అతడు దానిని కొనుగోలు చేసిన తర్వాత తీసిందిగా భావిస్తున్నారు. అమీర్ తండ్రి రషీద్ మీర్ ఓ ప్లంబర్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa