తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం అందింది. విజయవాడకు చెందిన భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందించారు. విజయవాడకు చెందిన మోనిష్ వెంకట సత్య ప్రకాష్ అనే భక్తుడు టీటీడీకి కోటి రూపాయలు విరాళం అందించారు. టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.కోటి విరాళంగా అందించారు. దాత తరపున ప్రతినిధి భూషణ్ తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో విరాళానికి చెందిన డీడీని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతికి అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.
విద్యార్థులకు వస్త్రాల పంపిణీ
మరోవైపు తిరుమల ధర్మగిరిలోని వేద విజ్ఞానం పీఠంలో వేద విద్య చదువుతున్న విద్యార్థులకు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి వస్త్రాలను పంపిణీ చేశారు. మరోవైపు వేద పాఠశాల విద్యార్థులకు ఏడాదికోసారి టీటీడీ వస్త్రాలు పంపిణీ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే శుక్రవారం రోజున 4 పంచెలు, ఒక దుప్పటి పంపిణీ చేశారు. వేదపాఠశాలోని 380 మంది విద్యార్థులకు వీటిని పంపిణీ చేశారు.
మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ నిత్యాన్నదానం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అన్నప్రసాదం మరింత నాణ్యతగా, రుచికరంగా ఉండేందుకు టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే టీటీడీకి బీయ్యం సరఫరా చేసే రైస్ మిల్లర్లతో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి భేటీ అయ్యారు. గురువారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అన్న ప్రసాదాల తయారీ కోసం మరింత నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని రైస్ మిల్లర్లను కోరారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీకి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఏఈవో వెల్లడించారు. బియ్యం నమూనాను తీసుకుని.. వాటిని ఉడికించిన తర్వాత.. క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత మాత్రమే అన్న ప్రసాద వినియోగానికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు తిరుమల, తిరుచానూరు ఆలయాలతో పాటు ఇతర స్థానిక ఆలయాల్లో అన్న ప్రసాదాల తయారీకి టీటీడీ ప్రతిరోజూ.. 20 వేల కేజీల బియ్యం ఉపయోగిస్తారు. ఇందులో ఏపీ నుంచి 60 శాతం, తెలంగాణ నుంచి 40 శాతం చొప్పున రైస్ మిల్లర్ల నుంచి టీటీడీ బియ్యం తీసుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa