ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2025లో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ .. యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఏడాపెడా ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆసియా రైజింగ్ స్టార్స్ 2025లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్లోనే అతడు ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా 42 బంతుల్లో 144 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో 15 సిక్స్లు, 11 ఫోర్లు ఉన్నాయి. వైభవ్ విధ్వంసంతో ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇదివరకు ఐపీఎల్లో విధ్వంసం సృష్టించిన వైభవ్.. ఇతర టోర్నీల్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ జితేశ్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రియాన్ష్ ఆర్యతో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన వైభవ్.. పెను విధ్వంసం సృష్టించాడు. ఓ పక్క మిగతా బ్యాటర్లు ఔట్ అవుతున్నా.. అతడు మాత్రం ఆగలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఆయాన్ ఖాన్ వేసిన మూడో ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదేసిన 14 ఏళ్ల వైభవ్.. ఆ తర్వాత జవదుల్లా బౌలింగ్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ రాబట్టాడు. రోహిద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టి.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
హాఫ్ సెంచరీ తర్వాత కూడా వైభవ్ జోరు కొనసాగించాడు. ఫరాజుద్దీన్ బౌలింగ్లో వరుసగా 4, 6, 4 కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లు బాది.. 98 పరుగులకు చేరుకున్నాడు. ముహమ్మద్ అర్ఫాన్ వేసిన పదో ఓవర్లో మరో ఫోర్ కొట్టి.. 32 బంతుల్లో మూడంకెల మార్కు చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన అతడు.. చివరకు 12.3 ఓవర్ల వద్ద మూడో వికెట్గా ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 195/3 కావడం గమనార్హం. మొత్తంగా ఈ మ్యాచ్లో అతడు 42 బంతుల్లో 144 పరుగులు స్కోరు చేశాడు.
కెప్టెన్ జితేశ్ శర్మ సైతం మెరుపులు మెరిపించాడు. 32 బంతుల్లో 83 రన్స్ స్కోరు చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో భారత్.. అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 297 పరుగులు స్కోరు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa