ట్రెండింగ్
Epaper    English    தமிழ்

32 చోట్ల కెమెరాలు.. స్పీడ్ 100 కి.మీ. దాటితే క్షణాల్లో ఫైన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 07:45 PM

మీ చేతిలో బైక్ ఉంది.. దారిలో విశాలంగా.. కొత్తగా వేసిన హైవే కనిపించిందనుకోండి.. మేఘాలలో తేలిపొమ్మనంది అంటూ దూసుకెళ్లాలనే కోరిక కలుగుతుంది. బ్రేకులు వదిలేసి బైక్‌ను పరుగులు తీయించమని మనసు పరుగులు తీస్తుంది. అయితే అలాంటి వారికి అధికారులు షాకిస్తున్నారు. హైవేల మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ.. అలాంటి వారి వేగానికి బ్రేకులేస్తున్నారు. ప్రమాదాలను నియంత్రించేందుకు ఈ తరహా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొత్తగా జాతీయ రహదారి 340సీ నిర్మించారు. నాలుగు వరుసలుగా ఈ జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. కొత్త జాతీయ రహదారి కావటంతో వాహనదారులు హైవే మీద దూసుకెళ్తున్నారు. అయితే అలాంటి వారికి కళ్లెం వేసేందుకు అధికారులు 32 సీసీ కెమెరాలను హైవే మీద ఏర్పాటు చేయించారు. డిజిటల్ తెరలు కూడా అమర్చారు. వీటి సాయంతో వాహనాల వేగాన్ని నియంత్రిస్తున్నారు.


హైవే మీద వాహనం ఎంత వేగంతో వెళ్తోందనేదీ ఈ డిజిటల్ తెరలు చూపిస్తాయి. అలాగే ఏదైనా వాహనం 100 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లినట్లయితే.. ఇవి బీప్ సౌండ్ ఇచ్చి అప్రమత్తం చేస్తాయి. ఇక వీటిని సోలార్ ఎనర్జీ సాయంతో పనిచేసేలా రూపొందించారు. అర కిలోమీటర్ దూరంలో జరిగిన ఘటనలను కూడా గుర్తించి.. రికార్డు చేసే సామర్థ్యం ఈ సీసీ కెమెరాలకు ఉంది. మరోవైపు 587 కోట్ల రూపాయలు ఖర్చుచేసి వీటిని ఏర్పాటు చేయించారు. నన్నూరు టోల్ ప్లాజా నుంచి మండ్లెమ్ వరకూ 34 కిలోమీటర్ల మేరకు 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ప్రతి రోజూ 5 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే వాహనదారులు అతివేగంతో వెళ్తున్నారనే కారణంగా అధికారులు ఈ ఏర్పాటు చేయించారు.


మరోవైపు ఈ సీసీ కెమెరాలను కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానం చేశారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది నిరంతరం ఈ సీసీ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తుంటారు. జాతీయ రహదారిపై ఏదైనా అనుకోని ఘటన జరిగితే కంట్రోల్ రూమ్ నుంచే కెమెరాల ద్వారా వాటిని రికార్డు చేసుకునే వీలుంది.మరోవైపు త్వరలోనే వీటిని పోలీస్ శాఖతో అనుసంధానం చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అతివేగంతో ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే కంట్రోల్‌ రూమ్ నుంచి అలాంటి వారిని గుర్తించి జరిమానా విధిస్తారు. ఈ జరిమానా విషయం సదరు వాహనదారుడికి మెసేజు రూపంలో వెళ్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa