ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పౌరులకు బలమైన ఈసీ అవసరం': బీహార్ ఎన్నికలపై ఎంకే స్టాలిన్

national |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 08:52 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా 202 సీట్లతో ఎన్డీఏ ఘన విజయాన్ని దక్కించుకోగా.. మహాగఠ్‌బంధన్ ఘోర పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో.. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ తన ప్రత్యేక విశ్లేషణను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ ప్రకటనలో ఆయన విజయం సాధించిన నితీష్ కుమార్‌కు అభినందనలు తెలుపుతూనే.. ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్రంగా కష్టపడిన తేజస్వీ యాదవ్‌పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు భారత ఎన్నికల సంఘం పని తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో ఈ విషయం కాస్తా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.


"బీహార్ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన సీనియర్ నాయకులు నితీష్ కుమార్ గారికి నా అభినందనలు. బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను. అదే విధంగా అలసిపోకుండా ప్రచారం చేసిన యువ నాయకులు తేజస్వి యాదవ్‌ను కూడా అభినందిస్తున్నాను" అని స్టాలిన్ మొదట పేర్కొన్నారు. ఆ తర్వాత ఫలితాలు ఈసీఐ దుశ్చర్యలను కడిగిపారేయవని చెప్పారు. ఈసీఐ ప్రతిష్ట ప్రస్తుతం పాతాళానికి చేరిందని చెప్పారు. ఈ దేశ పౌరులు ఒక బలమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల సంఘాన్ని కోరుకుంటున్నారని వివరించారు. ఓడిపోయిన వారిలో కూడా విశ్వాసాన్ని నింపే విధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.


ఫలితాల వెనుక నాలుగు ప్రధాన అంశాలు


బీహార్ ఎన్నికల ఫలితాల ద్వారా అందరూ నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలు ఉన్నాయని చెప్పిన సీఎం స్టాలిన్.. వాటిని విశ్లేషించారు. ఎన్నికల ఫలితాలు నాలుగు ప్రధాన అంశాలను ప్రతిబింబిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో ఒకటి సంక్షేమ పథకాల అమలని, రెండోది సామాజిక, సైద్ధాంతిక కూటములని తెలిపారు. ఇక మూడోది స్పష్టమైన రాజకీయ సందేశమని, నాలుగోది చివరి ఓటు పడే వరకు అంకిత భావంతో కూడిన నిర్వహణ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఫలితాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను ఇండియా కూటమి నాయకులు అర్థం చేసుకోగల సమర్థులు అని.. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా ప్రణాళికలు రూపొందించగలరని స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.


ఒకవైపు విజేతను అభినందిస్తూనే.. మరోవైపు ఎన్నికల ప్రక్రియ యొక్క అత్యున్నత సంస్థ పని తీరుపై ఇంత తీవ్రంగా వ్యాఖ్యానించడం ద్వారా స్టాలిన్ దేశంలో ఎన్నికల సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి వ్యూహం, ఈసీఐ పారదర్శకతపై దృష్టి పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa