కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక భారీ సైబర్ మోసం వెలుగులోకి రావడంతో.. సంచలనం సృష్టిస్తోంది. 57 ఏళ్ల మహిళను లక్ష్యంగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు.. దాదాపు రూ.32 కోట్లను కాజేశారు. అత్యంత తెలివిగా, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల పేర్లను ఉపయోగించి ఆ మహిళను డిజిటల్ అరెస్ట్ పేరుతో వర్చువల్ కస్టడీలో ఉంచారు. గతేడాది సెప్టెంబర్ 15వ తేదీన బాధితురాలికి డీహెచ్ఎల్ సిబ్బందిగా పేర్కొంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ముంబైలోని అంధేరి నుంచి ఆమె పేరు మీద బుక్ అయిన ఒక పార్సిల్లో 4 పాస్పోర్ట్లు, 3 క్రెడిట్ కార్డులు, ఎండీఎంఏ వంటి నిషేధిత వస్తువులు ఉన్నాయని చెప్పాడు. అయితే తన వివరాలను ఎవరో దుర్వినియోగం చేశారని ఆమె మొరపెట్టుకున్నప్పటికీ.. వారు ఆ కాల్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇక తాము సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న వ్యక్తులు ఆమెను బెదిరించారు.
ఈ నిషేధిత వస్తువులతో కూడిన పార్సిల్ ఉండటంతే ఆమెను వెంటనే అరెస్ట్ చేస్తామని వారు చెప్పడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. ఆమె వివరాలను దుర్వినియోగం చేసిన నేరగాళ్లు.. ఆమె నివసిస్తున్న ఇంటిని పర్యవేక్షిస్తున్నారని.. పోలీసులకు చెబితే, కుటుంబానికి హాని చేస్తారని భయపెట్టారు. దీంతో మరింత భయపడిన ఆ బాధితురాలు.. వారు ఏది చెబితే అది చేసి.. మరిన్ని చిక్కుల్లో పడింది.
సైబర్ మోసగాళ్లు ఆమె మొబైల్లో 2 స్కైప్ ఐడీలను ఇన్స్టాల్ చేయమని చెప్పారు. మోహిత్ హండా అనే పేరుతో పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి.. స్కైప్ ద్వారా ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఆమె గృహ నిర్బంధంలో ఉన్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత ప్రదీప్ సింగ్ అనే మరో వ్యక్తి సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అతడు ఆమెను మరింత భయపెట్టాడు. తీవ్రంగా తిట్టి, అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఇక ఆమె ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ద్వారా తన ఆస్తులను అన్నింటినీ తనిఖీ చేయించుకోవాలని ఒత్తిడి చేశారు.
ఆస్తుల తనిఖీ పేరుతో సైబర్ మోసగాళ్లు నకిలీ సీబీఐ పత్రాలను ఆమెకు చూపించారు. ఆమెకు ఉన్న మొత్తం ఆస్తుల్లో 90 శాతం ఆస్తులను.. క్లియరెన్స్ కోసం డిపాజిట్ చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు. భయంతో ఆమె ఆ డబ్బులను డిపాజిట్ చేసింది. ఆ తర్వాత అదనంగా రూ.2 కోట్లు ష్యూరిటీ పేరుతో.. మరికొంత మొత్తాన్ని ట్యాక్స్ల పేరుతో డిపాజిట్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే 2024 సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ మధ్య.. బాధితురాలు మొత్తం రూ.31.83 కోట్లను 187 ట్రాన్సాక్షన్ల ద్వారా సైబర్ మోసగాళ్ల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది.
ఇక ఈ ఏడాది మార్చి 26వ తేదీన సైబర్ మోసగాళ్లు ఉన్నట్టుండీ ఒక్కసారిగా అన్ని కమ్యూనికేషన్లను నిలిపివేయడంతో ఈ సుదీర్ఘ సైబర్ మోసం ముగిసింది. ఇక భారీ మొత్తంలో డబ్బులు మోసపోయిన తర్వాత బాధితురాలు.. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడికి గురైంది. ఈ ఏడాది జూన్ 8వ తేదీన తన కుమారుడి వివాహం పూర్తయ్యే వరకు వేచి చూసిన ఆమె.. నవంబర్ 14వ తేదీన అధికారికంగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa