ఢిల్లీ నగరం మళ్లీ భయాందోళనలో మునిగింది. గురువారం ఉదయం పటియాలా హౌస్ కోర్టు, సాకేత్ కోర్టు, రోహిణి కోర్టుతో పాటు ద్వారక, రోహిణి ప్రాంతాల్లోని పలు ప్రముఖ పాఠశాలలు, కాలేజీలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్లో భవనాల్లో పేలుడు పదార్థాలు దాచినట్లు దుండగులు రాసి పంపారు. ఈ ఘటనతో రాజధాని వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది.
తక్షణమే ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు, ఫైర్ టెండర్లతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా కోర్టు పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు, సిబ్బంది భద్రత కోసం అన్ని విద్యాసంస్థలను తక్షణం ఖాళీ చేయించారు. వందలాది మంది విద్యార్థులు భయంతో రోడ్లపైకి చేరుకున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ బెదిరింపు మెయిల్స్ ఒకే ఐడీ నుంచి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గత కొన్ని నెలలుగా ఢిల్లీలో ఇలాంటి బాంబు ఈ-మెయిల్స్ రావడం ఇది మొదటిసారి కాదు. మే నెలలోనూ 150కి పైగా పాఠశాలలకు ఇదే తరహా బెదిరింపులు వచ్చి భారీ ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి జరిగిన నేపథ్యంలో ఈ తాజా బెదిరింపులు రాజధాని భద్రతపై మరింత ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పోలీసులు సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు దృష్టి సారించగా, ప్రజల్లో మాత్రం భయం తొలగడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa