ట్రెండింగ్
Epaper    English    தமிழ்

124 ఏళ్లుగా పట్టాల కింద వేలాడుతూ ప్రయాణిస్తున్న రైలు

international |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 09:22 PM

ఉపయోగించకుండానే.. శతాబ్దాలు, దశాబ్దాల క్రితమే.. ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలు.. ప్రపంచ దేశాల్లో ఆవిష్కృతం అయ్యాయి. అలాంటి నిర్మాణాలను చూస్తుంటే.. ఇప్పటికి కూడా అలాంటివి నిర్మించడం సాధ్యం కాదు అనేది అర్థం అవుతుంది. ఇక ప్రజా రవాణాలో ప్రపంచ దేశాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రైల్వేలది.. అత్యంత పురాతన చరిత్ర. ఎప్పటి నుంచో రైల్వేలు.. మనుషులు, సరకు రవాణాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక అదే సమయంలో ఆయా దేశాల అభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అతి పురాతన సస్పెన్షన్ రైల్వే గురించి తెలుసుకుందాం.


జర్మనీలోని వుపెర్‌టాల్ నగరంలో ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సస్పెన్షన్ రైల్వే వుపెర్‌టాల్ ష్వెబెబాన్ ఉంది. 1901 నుంచి గత 124 ఏళ్లుగా నడుస్తున్న ఈ వుపెర్‌టాల్ ష్వెబెబాన్ రైలు.. పట్టాల కింద వేలాడుతూ నడుస్తుంది. పట్టాలనుంచి వేలాడుతూ ఈ రైలు.. వుపెర్‌టాల్ నగరంలోని వీధులు, మార్కెట్ ప్రాంతాలు, ముఖ్యంగా వుప్పర్ నది మీదుగా పరుగులు తీస్తుంది. సాధారణ రైల్వేలు, ట్రామ్‌లు సరిపోని వుపెర్‌టాల్ ఇరుకైన నదీ లోయకు పరిష్కారంగా.. ఇంజనీర్ యూజెన్ లాంగెన్ ఈ వినూత్న ఆలోచనను ప్రతిపాదించారు. ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులు.. దాదాపు 29 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ.. కింద ఉన్న నగర అందాలను ఆస్వాదించడం ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్రతిరోజు 80 వేల మందికి పైగా ప్రయాణికులకు ఈ వుపెర్‌టాల్ ష్వెబెబాన్ ఒక రవాణా మార్గంగా పనిచేస్తోంది.


1880లలో వుపెర్‌టాల్ నగరంలో ఉన్న వస్త్ర పరిశ్రమ కారణంగా అధి వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ కేంద్రంగా ఉండేది. అయితే ఆ నగరంలో జనాభా పెరగడంతో వారికి కావాల్సిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కానీ ఆ సిటీ వుప్పర్ నది వెంబడి ఇరుకైన లోయలో ఉండటంతో.. నది వంకర తిరిగే ఒడ్డున ట్రామ్‌లు, రైల్వేలు నిర్మించే అవకాశం లేకపోయింది. దీనికి పరిష్కారాన్ని కనుగొన్న.. ఇంజనీర్ యూజెన్ లాంగెన్ ఒక సస్పెన్షన్ రైల్వే వ్యవస్థను ప్రతిపాదించారు. ఈ ఆలోచనను నగర అధికారులు కూడా స్వాగతించడంతో 1898లో ఈ నిర్మాణం మొదలై 1901లో పూర్తి చేసి ప్రారంభోత్సవం జరుపుకుంది.


ఈ ష్వెబెబాన్ రైలు.. సాధారణ రైళ్ల లాగా చక్రాలపై నడవకుండా, పట్టాల పైభాగంలో అమర్చిన చక్రాల ద్వారా వేలాడుతూ ప్రయాణిస్తుంది. ప్రయాణికులు నిటారుగా కూర్చుని.. నగరం, వుప్పర్ నది దృశ్యాలను చూస్తూ ప్రయాణిస్తారు. కొన్ని చోట్ల ఈ రైలు భూమికి దాదాపు 29 అడుగుల ఎత్తులో వేలాడుతుంది. ఈ రైలు మార్గంలో మొత్తం 20 స్టేషన్లు ఉండగా.. దాన్ని పూర్తి చేయడానికి సుమారు 35 నిమిషాల సమయం పడుతుంది.


ఈ వుపెర్‌టాల్ ష్వెబెబాన్ రైల్వేను.. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు గత 124 ఏళ్లలో ఎన్నోసార్లు ఆధునీకరణ చేశారు. అయితే దాని చరిత్రను మాత్రం చెక్కుచెదరకుండా కాపాడుతూ వచ్చారు. 1901లో మొట్టమొదటిసారిగా ఈ రైల్వేను ప్రయాణించిన చారిత్రక కోచ్‌ను కైసర్ విల్హెల్మ్ II గౌరవార్థం.. కైసర్‌వాగన్ అని నామకరణం చేశారు. ఈ చారిత్రక కోచ్‌ను ఇప్పటికీ ప్రైవేట్ టూర్ల కోసం అద్దెకు ఇస్తున్నారు. నిత్యం 80 వేల మందికి పైగా ప్రయాణికులను చేరవేసే ఈ ష్వెబెబాన్ రైలు.. వుపెర్‌టాల్ నగరంలో ఒక కీలక ప్రజా రవాణా మార్గంగా, పర్యాటక ఆకర్షణగా కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa