ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30 ఏళ్ల నాటి ఫార్ములాతో ఇకుండా.. లేచి నిలబడు కాంగ్రెస్.. అహ్మద్ పటేల్ కుమార్తె ఘాటు విమర్శ

national |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 02:39 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత పార్టీ గత నేత, దివంగత అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ తీవ్రంగా స్పందించారు. మహాగఠబంధన్‌లో భాగమైనా కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమవడం పార్టీలో ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో ముంతాజ్ పటేల్ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను, ఆగ్రహాన్ని బయటపెట్టారు.
“మూడు దశాబ్దాల క్రితం పనిచేసిన పద్ధతులతో ఇప్పుడు ముందుకు సాగలేం” అని ఆమె స్పష్టం చేశారు.
“కొత్త ప్రభుత్వాలు, కొత్త ప్రత్యర్థులు, కొత్త రాజకీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ మనం ఇంకా పాత బురదలోనే కూరుకుపోయాం” అని ఆమె విమర్శించారు. ఓటమికి సాకులు చెప్పడం, ఇతరులపై నిందలు వేయడం మానుకొని నిజాలను ఒప్పుకోవలసిన అవసరాన్ని ఆమె గట్టిగా లేవనెత్తారు. “ఓడిపోతున్నాం అంటే ఎవరో ఒకరు మాయం చేశారని కాదు… మనలోనే లోపం ఉందని అర్థం చేసుకోవాలి” అని ఆమె హితవు పలికారు.
అత్యంత కీలకమైన విమర్శ మాత్రం పార్టీ అధికార కేంద్రీకరణపైనే సాగింది. “గ్రౌండ్ రియాల్టీ ఏమీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం పూర్తిగా కేంద్రీకృతమైంది. అని ఆమె ఆరోపించారు. ఈ ఒక్క కారణం వల్లే పదే పదే ఓటములు ఎదురవుతున్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకత్వం, కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడమే పరాజయాలకు మూలమన్నది ఆమె స్పష్టమైన ఉద్ఘాటన.
“ఇప్పటికైనా మేలుకోకపోతే, మార్పులు చేపట్టకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు మరింత దయనీయంగా తయారవుతుంది” అని ముంతాజ్ పటేల్ హెచ్చరించారు. దివంగత నేత అహ్మద్ పటేల్ రాజకీయ వారసురాలిగా ఆమె చేస్తున్న ఈ పిలుపు పార్టీలోపల గట్టి చర్చను రేకెత్తించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa