టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో దాన్ని మంచి కంటే ఎక్కువ చెడుకే ఉపయోగించేవారు ఎక్కువ అవుతున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఫోటోలు, వీడియోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి.. అసభ్యకరంగా, అశ్లీలంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. రాక్షసానందం పొందుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకుని.. కఠిన శిక్షలు విధిస్తున్నా.. మిగిలిన వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇటీవల వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలిచి.. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు గల ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కిన మైథిలీ ఠాకూర్కు సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది.
మైథిలీ ఠాకూర్తో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్లతో పెళ్లి అయినట్లు.. వారు జంటగా దండలు వేసుకున్నట్లు ఉన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడం పెను సంచలనంగా మారింది. కొంతమంది సంఘవిద్రోహక వ్యక్తులు సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇలాంటి ఫేక్ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. 'జిద్దీ పవన్ అహిర్' అనే ఫేస్బుక్ యూజర్.. మైథిలీ ఠాకూర్ ప్రతిష్ఠను దెబ్బతినేలా చేసేందుకు రూపొందించిన ఏఐ ఫొటోలను షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
మరోవైపు.. 'శుభం శుక్లా' అనే సోషల్ మీడియా యూజర్ ఈ అభ్యంతరకర పోస్ట్ల స్క్రీన్షాట్లను షేర్ చేసి.. ఇది చేసిన నిందితుడి చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ పోస్ట్ను బీహార్ పోలీసులకు ట్యాగ్ చేసిన శుభం శుక్లా.. యువ మహిళా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇంత అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు చేయడం ఇదే మొదటిసారి అని.. మీరు వీటిని చూడగలరా అని ప్రశ్నించారు.
ఇక ఈ పోస్ట్, ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది సైబర్ క్రైమ్ అని.. ఒక మహిళ గౌరవాన్ని కించపరచడమే అని ఆరోపించారు. ఏఐని ఉపయోగించి ఇలాంటి ఫేక్ చిత్రాలను వ్యాప్తి చేయడం అత్యంత హేయమైన చర్య అని.. ఐటీ చట్టం కింద నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మైథిలీ ఠాకూర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వైరల్ చేస్తున్న పోస్ట్లపై నెటిజన్ల నుంచి పెరుగుతున్న ఆగ్రహం వేళ.. బిహార్ పోలీసులు స్పందించారు. శుభం శుక్లా చేసిన పోస్ట్కు రిప్లై ఇచ్చిన పోలీసులు.. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవడానికి ఆ ప్రొఫైల్ కచ్చితమైన యూఆర్ఎల్ లేదా ఇతర సంబంధిత సమాచారాన్ని అందించాలని కోరారు. కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా మరింత దిగజారి.. ప్రధాని మోదీ, మైథిలీ ఠాకూర్లకు సంబంధించిన దారుణమైన వీడియోను కూడా ఏఐతో రూపొందించి వైరల్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa