ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలలో అదుపులోకి వచ్చిన పరిస్థితి,,,స్పాట్ బుకింగ్ టోకెన్ల జారీ కుదింపు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 08:31 PM

మండల మకరు విళక్కు పూజల కోసం నవంబరు 17న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోగా.. దర్శనాల కోసం భక్తులు పోటెత్తారు. దీంతో సన్నిధానం నుంచి పంబ వరకూ క్యూలైన్ నిలిచిపోయింది. అలాగే, సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై కేరళ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో అధికారులు చర్యలు చేపట్టి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బుధవారం రాత్రి నుంచి స్పాట్ బుకింగ్ టిక్కెట్ల కోటాను 5 వేలకు తగ్గించడం సహా పలు ఆంక్షలు విధించారు. అలాగే, నిలక్కల్, వండిపెరియార్ వద్ద మాత్రమే స్పాట్ బుకింగ్ టిక్కెట్లను జారీచేస్తున్నారు. పంపా, ఎరుమేలి, చెంగనూరులోని బుకింగ్ సెంటర్లను తాత్కాలికంగా నిలిపివేశారు.


వర్చువల్ క్యూ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో భక్తులు బుక్ చేసుకోవాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు విజ్ఞ‌ప్తి చేసింది. శబరిమలలో పరిస్థితులు, టీడీబీ చేపట్టిన చర్యలపై కేరళ హైకోర్టు తీవ్ర విమర్శలు గుప్పించింది. నవంబరు 17 నుంచి శబరిమలలో దర్శనాలకు అనుమతించగా.. 48 గంటల్లోనే 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులెత్తేశారు. క్యూలైన్‌లో ఓ మహిళా భక్తురాలు చనిపోయిన సంగతి తెలిసిందే.


నిలక్కల్‌లో బుధవారం అర్ధరాత్రి తర్వాత స్పాట్‌ బుకింగ్‌లు నిలిపివేయడంతో భక్తులు నిరసనకు దిగారు. గురువారం ఉదయం నుంచి మళ్లీ తెరుచుకోగా.. కేవలం 5 వేల టోకెన్లను జారీచేస్తామని ప్రకటించారు. ఆకస్మిక ఆంక్షలతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు గందరగోళానికి గురయ్యారు. స్పాట్ బుకింగ్‌లపై కేరళ హైకోర్టు ఆంక్షల గురించి తెలియక నిలక్కల్, పంపా వద్ద భారీగా భక్తులు బారులు తీరారు.


బుకింగ్ మొదలైన కొద్ది సమయంలో టోకెన్లు కోటా పూర్తికావడంతో టిక్కెట్ దొరక్క వందల మంది నిరాశకు గురయ్యారు. శబరిమల వెళ్లేందుకు అనుమతించకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు కొత్త నిబందనల గురించి వివరించ సిబ్బంది నానా తంటాలు పడ్డారు.


శబరిమల ఏడీఎం అరుణ్ ఎస్ నాయర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందన్నారు. ‘‘యాత్ర ఐదో రోజుకు చేరుకుంటున్న తరుణంలో, ప్రారంభ రోజుల్లో జరిగిన లోపాలను పూర్తిగా సరిదిద్దారు.. మండల మకరు విళక్కు యాత్రా సీజన్‌ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడానికి టీడీబీతో పాటు అన్ని విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. యాత్రా సీజన్ ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించిన ఏడీఎం.. సన్నిధానం నుంచి మారక్కొట్టం వరకూ చేపట్టిన భారీ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


పంపా నుంచి సన్నిధానం వరకు ఉన్న మార్గంలో బయో, నాన్-బయో వ్యర్థాలను 400 మందికిపైగా వర్కర్లు సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో పూర్తిగా తొలగించారు. అత్యవసర ఔషధాల కిట్, తాగునీరు, ఆహారం సరఫరాతో పాటు పారిశుద్ధ్యం సక్రమంగా జరగాలని అన్ని విభాగాలను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa