అనారోగ్యం ఎప్పుడు వస్తుందో ముందుగా ఊహించడం కష్టం. ఒకసారి వచ్చిన తర్వాత శారీరక కష్టాలకే కాదు, కుటుంబానికి ఆర్థికంగా కూడా పెద్ద భారంగా మారుతుంది. నేటికీ మన దేశంలో చాలా మంది చికిత్స ఖర్చులు ఎక్కువ అవుతాయన్న ఆందోళనతో ఆసుపత్రికి వెళ్లడానికే వెనుకాడుతున్నారు. ఈ భయాన్ని తొలగించి, అవసరమైన ప్రతి ఒక్కరికీ సమయానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకాలలో ఒకటైన ఈ కార్యక్రమం పేద కుటుంబాలకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య రక్షణను అందిస్తుంది. ఈ కార్డు కలిగినవారు దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్యానెల్డ్ చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిగా క్యాష్లెస్ విధానంలో చికిత్స పొందగలరు. ఆసుపత్రిలో చేరడం, శస్త్రచికిత్స, మందులు, డిశ్చార్జ్ వంటి అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి లబ్ధిదారులు తమ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సి ఉండదు. ఈ కార్డును ఏడాదిలో ఎన్ని సార్లైనా ఉపయోగించుకోవచ్చు; కీలకమైన విషయం ఏమిటంటే మొత్తం ఖర్చు వార్షికంగా నిర్దేశించిన రూ.5 లక్షల పరిమితిని మించకూడదు. ఒకే సందర్భంలో ఈ లిమిట్ పూర్తిగా ఖర్చయితే ఆ ఆర్థిక సంవత్సరంలో మిగతా సమయానికి పథకం ప్రయోజనం అందదు, అయితే ప్రతి ఏప్రిల్ 1న కార్డు లిమిట్ ఆటోమేటిక్గా మళ్లీ రీన్యూ అవుతుంది. ఈ కార్డును పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆధార్ వివరాలు నమోదు చేసి OTP వెరిఫికేషన్ పూర్తిచేస్తే వెంటనే కార్డు లభిస్తుంది. టెక్నాలజీతో పరిచయం లేని వారు సమీపంలోని CSC లేదా CHC కేంద్రాలకు వెళ్లి ఆరోగ్య మిత్రల సహాయంతో అర్హత ధృవీకరణ పూర్తి చేసుకుని కార్డు పొందవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa