దేశంలో ఉగ్రవాదులు వైద్యులుగా నటిస్తూ.. గాజాలో హమాస్ లాగా హాస్పిటల్స్, మెడికల్ సెంటర్లలోని స్టాఫ్ లాకర్లను ఆయుధాలు, పేలుడు పదార్థాలు దాచిపెట్టే కేంద్రాలుగా వినియోగిస్తుండటం ఆందోళనకు గురిచేసే అంశమని జాతీయ దర్యాప్తు సంస్థ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ ఎర్రకోట వద్ద నవంబరు 10న జరిగిన కారు పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం ముగ్గురు వైద్యులు మొహమ్మద్ షకీల్, అదిల్ అహ్మద్ రదర్, షహీన్ సయీద్లను అదుపులోకి తీసుకున్నారు. కారును నడిపిన ఫిదాయి ఉమర్ నబీ కూడా డాక్టరే.
షకీల్, మొహమ్మద్లు ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ ఆసుపత్రిలోనూ.. రదర్ జమ్మూ కశ్మీర్ అనంత్నాగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు.. జీఎంసీలో తనిఖీలు నిర్వహించిన సమయంలో లాకర్ రూమ్లోని అసాల్ట్ రైఫిల్, పేలుడు పదార్థాలను గుర్తించారు. షహీన్ సయీద్ కారులో రైఫిల్, అమ్మోనియం నైట్రేట్ పెద్ద మొత్తంలో లభ్యమయ్యాయి.
అనుమానితుల నుంచి లభించిన సమాచారం విచారణలో బయటపడ్డ వివరాలు.. అనంతనాగ్, బారాముల్లా, బుద్గామ్ జిల్లాల్లోని ఆసుపత్రులను ఆయుధ కేంద్రాలుగా మార్చే యోచనలో ఉగ్రవాదులున్నట్టు గుర్తించారు. సాధారణంగా వైద్యులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడతారని అనుమానించరన్న నమ్మకంతో ఈ ప్లాన్ రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. గాజాలోని ప్రధాన ఆసుపత్రుల్లో హమాస్ ఆయుధాలను దాచిపెట్టిన సంఘటనలను గుర్తు చేస్తోందని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.
ఉదాహరణకు ఈ ఏడాది జూన్లో ఇజ్రాయెల్ సైన్యం, గాజా అల్-షిఫా ఆసుపత్రి కింద హమాస్ నిర్మించిన టన్నెల్ నెట్వర్క్ను గుర్తించినట్లు తెలిపింది. ఆ టన్నెల్లు ఆయుధాలను దాచిపెట్టడానికి, కమాండ్-అండ్-కంట్రోల్ కేంద్రాలుగా వినియోగించినట్టు పేర్కొంది. ఎర్రకోట పేలుడు ఘటనలో 10 మంది సభ్యుల వైద్యుల ఉగ్ర మాడ్యూల్ వెనక పాకిస్థాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అలాగే, హమాస్తో సంబంధాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజమైతే, డిల్లీలో పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదులు, జైషే మొహమ్మద్ మధ్య ఉన్న ఆపరేషనల్ సంబంధం మరింత విస్తరించినట్లు అవుతుంది.
రదర్ను విచారించేటప్పుడు ఈ కీలక సమాచారం బయటపడినట్లు వర్గాలు పేర్కొన్నాయి. టెర్రర్ డాక్టర్ కేసులో మొదటి అరెస్టైన అనుమానితుడు అదిల్ రదర్. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని నౌగమ్లో జైషేకు మద్దతుగా పోస్టర్లు అతికించింది రదర్. అతడ్ని యూపీలోని షహారన్పూర్లో అరెస్ట్ చేయడంలో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలోని ఉగ్రవాదుల వైద్యుల గురించి కీలక సమాచారం బయటపెట్టాడు. ఆ తర్వాత భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్ పట్టుబడింది. ఈ పరిణామాలతో తాను దొరికిపోతాననే భయంతో డాక్టర్ నబీ.. పేలుడుకు పాల్పడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa