ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారంతో టాయిలెట్ కమోడ్.. ధర ఏకంగా రూ.107 కోట్లు

international |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 09:58 PM

వేలంలో చాలా రకాల వస్తువులు భారీ ధర పలికి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. చారిత్రక వస్తువులు, గొప్ప సాంస్కృతిక వస్తువులు, ఎవరైనా గొప్ప గొప్ప వ్యక్తులకు సంబంధించిన అరుదైన వస్తువులను దక్కించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎగబడుతూ ఉంటారు. అందుకోసం ఎన్ని కోట్లు అయినా వెచ్చించేందుకు సిద్ధం అవుతారు. ఇక చాలా విశేషాలు, ప్రత్యేకతలు, చరిత్ర ఉన్న వస్తువులను వేలంలో ఉంచి.. ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తారు. అయితే ఓ బంగారు టాయిలెట్ కమోడ్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బంగారంతో తయారు చేసిన ఓ గోల్డ్ టాయిలెట్ కమోడ్.. తాజాగా నిర్వహించిన ఓ వేలంలో ఏకంగా రూ.107 కోట్లకు పైగా పలికి అందర్నీ ఆశ్చర్యంలో మునిగిపోయేలా చేసింది.


అమెరికాలోని న్యూయార్క్‌లోని సోథెబీస్ వేలం కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ వేలం పాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాభిమానులను ఆకర్షించింది. ఇందులో రెండు సంచలన కళాఖండాలు భారీ ధర పలకడం విశేషం. ఆస్ట్రియన్ చిత్రకారుడు గుస్తావ్ క్లిమ్ట్ గీసిన 'పోర్ట్రెయిట్ ఆఫ్ ఎలిజబెత్ లెడెరర్' పెయింటింగ్ ఏకంగా 236 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ. 1,960 కోట్లకు అమ్ముడుపోయి.. ఆధునిక కళాఖండాల వేలంలోనే వరల్డ్ రికార్డు సాధించింది. ఈ పోర్ట్రెయిట్ రెండో ప్రపంచ యుద్ధాన్ని తట్టుకుని చెక్కు చెదరకుండా మిగిలిన క్లిమ్ట్ అరుదైన చిత్రాల్లో ఒకటి కావడం గమనార్హం. ఇదివరకు ఈ పెయింటింగ్ సౌందర్య ఉత్పత్తుల దిగ్గజం ఎస్టీ లాడర్ కంపెనీస్ వారసుడు, బిలియనీర్ లియోనార్డ్ ఎ. లాడర్ సేకరణలో ఉండేది.


ఇక ఇదే వేలంలో.. అత్యంత ధనవంతులను విమర్శిస్తూ ఇటాలియన్ కళాకారుడు మౌరీజియో కాటెలాన్ తయారు చేసిన ఘనమైన బంగారు టాయిలెట్ కూడా 12.1 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో ఏకంగా రూ. 107 కోట్లకు పైగానే పలికి.. అందరికీ షాక్‌ ఇచ్చింది. గోడకు అరటిపండును టేప్‌తో అతికించి గతంలో చర్చనీయాంశమైన కాటెలాన్.. ఈసారి 18 క్యారెట్ల ఘన బంగారంతో తయారు చేసిన టాయిలెట్ కమోడ్‌ను వేలం వేశారు. అయితే ఈ టాయిలెట్ కమోడ్.. పూర్తిగా పనిచేసేది కావడం మరో విశేషం.


ఈ బంగారు టాయిలెట్ కమోడ్ బరువు 101 కిలోలు కాగా.. వేలంలో దాని ప్రారంభ బిడ్ 10 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.88 కోట్లతో ప్రారంభించగా.. చివరికి 12.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 100 కోట్లు) అమ్ముడైంది. అయితే దీన్ని వేలంలో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని కాటెలాన్ తెలిపారు. అమెరికా అనే పేరు కలిగిన ఈ కళాఖండం.. అత్యంత ధనవంతుల లైఫ్ స్టైల్‌పై వ్యంగ్యంగా చేసిన సెటైర్ అని తెలిపారు. 200 డాలర్ల లంచ్‌ తిన్నా లేదా 2 డాలర్ల హాట్ డాగ్‌ తిన్నా.. టాయిలెట్‌లో మాత్రం ఒకటే వస్తుందని గతంలో కాటెలాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.


అయితే 2016లో ఇలాంటి బంగారు టాయిలెట్లను కాటెలాన్ రెండు తయారు చేశారు. అందులో ఒకదాన్ని న్యూయార్క్ గుగ్గెన్‌హైమ్ మ్యూజియంలో ప్రదర్శించారు. ఆ తర్వాత యూకేలోని బ్లెన్‌హైమ్ ప్యాలెస్‌లో ప్రదర్శిస్తుండగా దాన్ని కొందరు దొంగిలించారు. అయితే ఆ దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులు దోషులుగా తేలినా.. వారు ఆ బంగారు టాయిలెట్‌ను ముక్కలు చేసి కరిగించి ఉంటారని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa