ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి.. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద క్యాంపులు, ఎయిర్బేస్లపై.. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో భారత్ దెబ్బకు వణికిపోయిన పాకిస్తాన్.. భారత్తో కాళ్ల బేరానికి వచ్చి.. దాడులు ఆపాలని కోరింది. దీంతో భారత్ దాడులు ఆపేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని అంగీకరించలేకపోతోంది. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన మధ్యవర్తిత్వం కారణంగానే భారత్-పాక్ యుద్ధం ఆగిపోయిందని పదే పదే చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలువడిన ఒక యూఎస్ రిపోర్ట్ మరిన్ని విమర్శలకు కారణం అయింది.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా 4 రోజుల పాటు జరిగిన ఘర్షణలో భారత్పై పాకిస్తాన్ సైనిక విజయాన్ని సాధించిందని.. అమెరికా-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ (యూఎస్సీసీ) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పాకిస్తాన్ సాధించిన ఈ విజయం చైనా ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని తెలిపింది. ఈ భారత్, పాక్ ఘర్షణలో చైనా ప్రాక్సీ యుద్ధం చేసిందని.. చెప్పలేకపోయినా.. చైనా ఒక అవకాశవాదంగా ఉపయోగించుకుందని వెల్లడించింది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా తన అధునాతన ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి, ప్రపంచానికి ప్రచారం చేసుకోవడానికి ఈ ఘర్షణను వాడుకుందని ఆ నివేదిక తెలిపింది.
ఫ్రాన్స్కు చెందిన రఫెల్ యుద్ధ విమానాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి.. తమ దేశానికి చెందిన జే-35 ఫైటర్ జెట్లను ప్రచారం చేయడానికి చైనా నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించిన ఫోటోలను ఉపయోగించి తప్పుడు సమాచార ప్రచారాన్ని చైనా చేసిందని యూఎస్సీసీ రిపోర్ట్ తెలిపింది. భారత్-పాక్ ఘర్షణ సమయంలో పాకిస్తాన్ సైన్యం చైనా ఆయుధాలను ఉపయోగించడంతో పాటు.. చైనా నిఘా సహకారాన్ని కూడా వినియోగించుకుందని ప్రస్తావించింది. మరోవైపు.. ఈ యూఎస్సీసీ రిపోర్ట్.. పహల్గామ్ దాడిని.. ఉగ్రదాడి అని కాకుండా.. 'వివాదాస్పద జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 26 మంది పౌరులను చంపిన ప్రమాదకరమైన తిరుగుబాటు దాడికి బదులుగా భారత్ చేసిన ఘర్షణగా అభివర్ణించింది.
ఇక యూఎస్సీసీ.. తన రిపోర్ట్ను అమెరికా కాంగ్రెస్ ముందు ఉంచింది. ఈ రిపోర్ట్ బయటికి రావడంతో.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని తిరుగుబాటు దాడిగా పేర్కొనడం చాలా ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే నిరసన తెలియజేయాలని ఎక్స్లో జైరాం రమేష్ డిమాండ్ చేశారు.
యూఎస్సీసీ అంటే ఏంటి?
అమెరికా-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ (యూఎస్సీసీ) అనేది 2000 సంవత్సరంలో అమెరికన్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర, ద్విపక్ష కమిషన్. చైనాతో అమెరికా వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రతా అంశాలను పర్యవేక్షించడం, వాటి వివరాలను కాంగ్రెస్కు నివేదించడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa