ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

international |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 10:03 PM

పాకిస్థాన్‌లో పారిశ్రామిక భద్రతా ప్రమాణాల వైఫల్యం మరోసారి తీరని విషాదాన్ని మిగిల్చింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ నగరంలో గ్లూ (గమ్) తయారుచేసే ఒక ఫ్యాక్టరీలో భారీ బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ భయంకర ప్రమాదంలో 15 మంది కార్మికులు మృత్యువాత పడగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకొని ఉండవచ్చనే అనుమానంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వర్గాలు నివేదిస్తున్నాయి. .


పేలుడు దాటికి ధ్వంసమైన ప్రాంతం..


ఫైసలాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం పూర్తిగా కుప్పకూలింది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, ఇతర నిర్మాణాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదు. కానీ దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ యజమాని పరారీ కాగా.. మేనేజర్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా నిబంధనలను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ ఘోరం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదీ చూడండి: జమ్మూ కాశ్మీర్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 20మందికిపైగా తీవ్ర గాయాలు


మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి మరయం నవాజ్‌ షరీఫ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. పాకిస్థాన్‌లోని పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను యజమానులు గాలికొదిలేయడం వల్ల తరచూ ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానిక మీడియా విశ్లేషిస్తోంది. కఠినమైన భద్రతా నిబంధనలు లేకపోవడం, కార్మికులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం, పాతబడిన యంత్రాలను వినియోగించడం వంటి అంశాలు ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.


గతంలో ఫైసలాబాద్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. గత ఏడాదే ఇదే నగరంలో జరిగిన మరో బాయిలర్‌ పేలుడులో 12 మంది మరణించారు. అంతేకాకుండా వారం రోజుల క్రితం కరాచీలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. ఇలా వరుసగా జరుగుతున్న పారిశ్రామిక విపత్తులు, దేశంలో కార్మికుల భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈక్రమంలోనే ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పారిశ్రామిక భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని పౌర సమాజ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa