బంగ్లాదేశ్లోని ఢాకా, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే సమయంలో మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ - ఐర్లాండ్ రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండటంతో, అందరూ ఒక్కసారిగా భయపడ్డారు. దాంతో షేర్-ఇ-బంగ్లా స్టేడియంలో జరుగుతున్న మూడో రోజు ఆట కొన్ని నిమిషాల పాటు నిలిచిపోయింది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ 56వ ఓవర్ రెండో బంతి వేస్తున్న సమయంలో ప్రకంపనలు స్పష్టంగా తెలియడంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లు వెంటనే బౌండరీ లైన్ వైపు పరుగులు తీశారు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల్లో కూడా ఆందోళన కనిపించింది.
భూకంప ప్రకంపనల కారణంగా ఆట సుమారు మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు నిలిచింది. ఆ చిన్న విరామం అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. అమెరికా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం నర్సిండి సమీపంలో భూకంప కేంద్రం నమోదైంది. 10:38 సమయంలో ప్రకంపనలు సంభవించగా, మ్యాచ్ అధికారికంగా 10:41కు తిరిగి ప్రారంభమైంది. ప్రకంపనలతో భయాందోళనకు గురైన ఆటగాళ్లు అందరూ సురక్షిత ప్రదేశాలకు వచ్చారు.
ఇదిలా ఉండగా, రెండో రోజు బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం తన 100వ టెస్ట్ మ్యాచ్లో అద్భుత శతకం నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. 214 బంతుల్లో 106 పరుగులు చేసి జట్టును తొలి ఇన్నింగ్స్లో 476 పరుగుల భారీ స్కోరు దిశగా నడిపించాడు. 100వ టెస్ట్లో శతకం నమోదు చేసిన ప్రపంచంలోని 11వ బ్యాటర్గా రహీం నిలిచాడు.
ఇక మూడో రోజు మ్యాచ్ విషయానికి వస్తే భూకంపం వచ్చే సమయానికి 233/7తో ఉన్న ఐర్లాండ్ జట్టు ఆ తర్వాత 32 పరుగులు చేసి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకున్న ఐర్లాండ్ జట్టు 265 పరుగులకు ఆలౌట్ అయింది. ఐర్లాండ్ జట్టులో టక్కర్ 75, జోర్డన్ నీల్ 49, స్టీఫెన్ 46 పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 476 పరుగులు చేయడంతో.. 211 పరుగుల ఆధిక్యం దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa