ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని లోకేశ్ హామీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 06:36 AM

రాష్ట్రంలో విద్యారంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టి సారించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించడంతో పాటు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు తమ సమస్యలతో కూడిన 11 అంశాల వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.గత ప్రభుత్వం సుమారు రూ.4,200 కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని లోకేశ్ తెలిపారు. ఆర్థిక వెసులుబాటును బట్టి ఈ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల్లో రాజకీయ ప్రసంగాలు, జెండాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆయన తేల్చిచెప్పారు. అయితే, విద్యాసంస్థల పనివేళలు ముగిశాక, రాజకీయేతర సమస్యలపై చర్చించుకోవడానికి విద్యార్థి సంఘాలకు ప్రత్యేక వేదిక కల్పిస్తామని అన్నారు.రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సుమారు 4,300 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, న్యాయపరమైన చిక్కులను అధిగమించి వీలైనంత త్వరగా వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని లోకేశ్ వెల్లడించారు. వచ్చే ఏడాదికి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూల్‌ను ఈ ఏడాదే విడుదల చేసి, పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థుల బస్ పాస్‌ల జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు అపార్ ఐడీతో అనుసంధానం చేస్తామని చెప్పారు. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa