డిజిటల్ గోల్డ్ లేదా ఇ-గోల్డ్ ఉత్పత్తులను తమ నియంత్రణ పరిధిలోకి తీసుకునే ప్రసక్తే లేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ తుహిన్కాంత పాండే స్పష్టం చేశారు. మదుపరులు ఇలాంటి నియంత్రణ లేని పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతుండటంతో చాలా మంది డిజిటల్ గోల్డ్ వైపు ఆకర్షితులవుతున్నారు. అనేక యాప్లు, వెబ్సైట్లు, చెల్లింపుల సంస్థలు సైతం తక్కువ మొత్తంతో బంగారంపై పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే, ఇలాంటి పథకాలతో అత్యంత నష్టభయం పొంచి ఉందని సెబీ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రీట్స్, ఇన్విట్స్-2025 సదస్సులో పాల్గొన్న సెబీ ఛైర్మన్ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కేవలం మ్యూచువల్ ఫండ్స్ అందించే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గోల్డ్ సెక్యూరిటీల వంటి నియంత్రిత మార్గాలను మాత్రమే ఎంచుకోవాలని ఆయన తెలిపారు. డిజిటల్ గోల్డ్ అందించే ప్లాట్ఫామ్లు సెబీ పరిధిలోకి రావని, అందువల్ల మదుపరుల పెట్టుబడులకు ఎలాంటి రక్షణ ఉండదని సెబీ గతంలోనే ఓ నోటిఫికేషన్లో పేర్కొంది. ఒకవేళ ఆ సంస్థలు దివాలా తీసినా లేదా మూతపడినా పెట్టుబడిదారుల సొమ్ము నష్టపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.తమను కూడా నియంత్రణలోకి తీసుకోవాలని డిజిటల్ గోల్డ్ పరిశ్రమ వర్గాలు కోరినప్పటికీ, సెబీ అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే సెబీ ఛైర్మన్ తాజా ప్రకటనతో ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇచ్చినట్లయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa