కేరళ హైకోర్టు శబరిమల శ్రీ అయ్యప్పస్వామి దర్శనం కోసం స్పాట్ బుకింగ్స్పై పెట్టిన కఠిన ఆంక్షలను గణనీయంగా సడలించింది. ఇకపై రోజువారీ రద్దీని బట్టి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, రాష్ట్ర పోలీసు అధిపతి సంయుక్తంగా నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. భక్తుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ సౌలభ్యం కల్పించినట్లు తెలుస్తోంది.
గతంలో రోజుకు 20 వేల మందికి అనుమతి ఉన్న స్పాట్ బుకింగ్స్ను భారీ రద్దీ కారణంగా కేవలం 5 వేలకు తగ్గించారు. ఈ నిర్ణయం వేలాది మంది అయ్యప్ప భక్తులను నిరాశపరిచింది. చాలా మంది రాత్రికి రాత్రి బయలుదేరి వచ్నప్పటికీ దర్శన టోకెన్ రాకపోవడంతో తిరిగి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఇబందుల నేపథ్యంలోనే హైకోర్టు జోక్యం చేసుకుంది.
ప్రస్తుతం నీలక్కల్ వద్ద ప్రత్యేక స్పాట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడే తమకు టోకెన్ లభిస్తుందన్న ఆశతో బారులు కడుతున్నారు. ఇకపై రద్దీ తీవ్రత ఎంత ఉందన్న దాన్ని బట్టి బోర్డు, పోలీసులు సంయుక్తంగా సంఖ్యను పెంచే అవకాశం ఉంది. దీంతో ఎటువంటి ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చే భక్తులకు ఊరట లభించనుంది.
మరోవైపు ఆన్లైన్ వర్చువల్ క్యూ ద్వారా ప్రతిరోజూ 70 వేల మందికి సులువుగా దర్శనం కల్పిస్తున్నారు. అయితే ఆన్లైన్ స్లాట్ రాని వారు, లేదా ఆఖరి నిమిషంలో అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తుల కోసం స్పాట్ బుకింగ్ అవసరమన్న వాదన బలంగా వినిపిస్తోంది. హైకోర్టు తీర్పుతో ఈ మండల మకరవిళక్కు సీజన్లో లక్షలాది మంది స్వామి దర్శనం సుగమం కానుంది. స్వామీ శరణం!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa