సీబీఐ కోర్టు హాల్లో జడ్జి ముందు వైయస్ఆర్సీపీ అధినేత నిలబడి ఉన్న వీడియోను రహస్యంగా చిత్రీకరించి రాజకీయ కుట్రతో వాటిని వైరల్ చేస్తున్నారని, దీన్ని కంటెప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణించి.. వీడియోను చిత్రీకరించిన వారిని, వాటిని ప్రసారం చేసిన టీవీ5, ఏబీయన్ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా వైయస్ జగన్ కి వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలకు తెరలేపిందని, అందులో భాగంగానే దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత ఎక్కడ పర్యటించినా ఆయన కోసం వేల సంఖ్యలో అభిమానులు వస్తుండగా, అధికారంలో ఉన్నా చంద్రబాబు, లోకేష్ల ను ప్రజలు పట్టించుకోవడం లేదనే అక్కసుతోనే.. వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఇలాంటి దుర్మార్గపు పనులకు పూనుకుంటున్నారని సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా ఆయన గౌరవాన్ని నాటి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కాపాడితే, నేడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని అగౌరవ పరిచేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అధికార గర్వంతో విర్రవీగిపోయి చేసే ఇలాంటి చర్యలకు భవిష్యత్తలో ఖచ్చితంగా గుణపాఠం చెబుతామని సుధాకర్ బాబు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa