ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఆ జిల్లాకు క్యూ కడుతున్న కంపెనీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 07:04 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఏపీ పారిశ్రామిక విధానాల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఐటీ రంగం దగ్గర నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వరకూ అనేక కంపెనీలు ఏపీలో పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులోనూ పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీకి వస్తున్న పెట్టుబడులలో ఎక్కువ భాగం విశాఖపట్నం వెళ్తున్నాయని చెప్పొచ్చు. సాగర తీరం, మౌలిక వసతుల కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు విశాఖ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం సమీప ప్రాంతాలకు కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ వరుసలో అనకాపల్లి జిల్లా ముందుంటోంది.


విశాఖపట్నం సమీపంలో ఉండటం, సముద్ర తీర ప్రాంతంతో పాటుగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, రవాణా వంటి సౌకర్యాలు అనకాపల్లి జిల్లాలో అందుబాటులో ఉండటం కలిసి వస్తోంది. ఈ కారణంగా అనకాపల్లి జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక అనకాపల్లి జిల్లా విషయానికి వస్తే ఇప్పటికే ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ సంస్థలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు.


అలాగే మాకవరపాలెం మండలంలో ఎర్త్ మూవర్స్ అనే కంపెనీ పెట్టుబడులు పెడుతోంది. రూ.1234 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో యంత్రాలు, విడిభాగాల తయారీ ప్లాంట్ నెలకొల్పనుంది. ఇక రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.784 కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. ఇందుకోసం 30 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించింది. అలాగే బీక్యూ టెక్స్‌టైల్స్ సంస్థ కూడా పెట్టుబడులు పెడుతోంది.


వీటితో పాటుగా గ్రీన్ హైడ్రోజన్ సిటీ, క్లీన్ టెక్ మాన్యుఫ్యాక్చరింగ్ సిటీ, మెడ్ టెక్ జోన్లు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటుగా చిన్న, మధ్యతరహా కంపెనీలు కూడా అనకాపల్లి జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటంతో పాటుగా విశాఖ నగరం విస్తరిస్తూ ఉండటంతో అనకాపల్లి జిల్లాలో భూముల ధరలు పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa