మనుషులేం మెషీన్లు కాదు.. అప్పుడప్పుడూ తప్పులు జరుగుతుంటాయ్ అది సహజం.. కానీ మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే అధికారులు సకాలంలో గుర్తించడంతో.. ఎలాంటి సమస్య కాలేదు. అయితే విద్యార్థులు మాత్రం కాసేపు గందరగోళానికి గురయ్యారు. ఇక అసలు సంగతిలోకి వస్తే.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఎంకామ్ కామర్స్ విద్యార్థులకు Income Tax and Practice Exam నిర్వహించారు. అయితే ఈ ప్రశ్నపత్రం తయారు చేసే సమయంలో క్వశ్చన్ పేపర్ సెట్టర్ తప్పిదం చేశారు. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు.
Income Tax and Practice Exam క్వశ్చన్ పేపర్లోని సెక్షన్ బీలో ఒకే ప్రశ్న మూడుసార్లు ఇచ్చారు. 2బీ,3ఏ, 4ఏలో ఒకే ప్రశ్న మూడుసార్లు ఉండటంతో విద్యార్థులు పరీక్ష సమయంలో గందరగోళానికి గురయ్యారు. వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన వర్సిటీ అధికారులు.. విద్యార్థులకు రెండో సెట్ పేపర్ అందించారు. పేపర్ సెట్టర్ తప్పు కారణంగా సమయం వృథా కావటంతో విద్యార్థులకు మరో పది నిమిషాలు అదనపు సమయం కూడా కేటాయించారు. మరోవైపు ఈ విషయం మీద ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ పరీక్షల విభాగం అధికారులు స్పందించారు. పేపర్ సెట్టర్ కారణంగా ఒకే ప్రశ్న మూడుసార్లు వచ్చిందని.. వెంటనే పరిస్థితిని సరిదిద్దామన్నారు. క్వశ్చన్ పేపర్ సెట్ మార్చామని.. విద్యార్థులకు అదనపు సమయం కూడా ఇచ్చామన్నారు.
అయితే ఈ విషయంలో కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఒకే ప్రశ్న మూడుసార్లు రావటం చర్చనీయాంశం కాగా.. నెటిజనం సరదాగా స్పందిస్తున్నారు. ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిసి ఉంటే.. మూడు సార్లు ఒకే జవాబు రాసి .. మంచి మార్కులు సంపాదించుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నారంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే యూనివర్సిటీ అధికారులు వెంటనే అప్రమత్తం కావటంతో ఈ పొరబాటు కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa