ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధానమంత్రి ఉచిత స్కూటీ పథకం.. కాలేజీ యువతులకు కేంద్రం ఫ్రీగా స్కూటీలు

Crime |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 08:15 PM

రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా.. సైబర్ నేరాలు మాత్రం ఆగడం లేదు. రోజుకో రకమైన కొత్త కొత్త మోసాలతో.. సైబర్ కేటుగాళ్లు.. ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. చదువుకోని వారు మాత్రమే కాకుండా.. చాలా మంది చదువుకున్న వారు కూడా ఈ సైబర్ మోసాల బారిన పడి.. డబ్బులు, సున్నితమైన సమాచారాన్ని కోల్పోతున్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు, అమలు చేయని పథకాల పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు.. అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా ప్రధానమంత్రి ఉచిత స్కూటీ యోజన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.


కాలేజీకి వెళ్లే బాలికలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా స్కూటీలను అందిస్తోందని.. దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు, అప్లికేషన్ లింక్స్.. నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నోడల్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది.


మీరు కూడా ప్రధానమంత్రి ఉచిత స్కూటీ పథకంకు బలయ్యారా అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పథకం కింద చదువుకునే బాలికలకు ఉచిత స్కూటీలు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నకిలీదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని ఏదీ అమలు చేయడం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.


ఇలాంటి తప్పుడు ప్రచార పోస్టులు సాధారణంగా ప్రజలను నకిలీ వెబ్‌సైట్‌లకు లేదా ఫారమ్‌లకు మళ్లిస్తాయని పీఐబీ తెలిపింది. అక్కడ వారు పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ నంబర్లు, ఏటీఎం పిన్‌ నంబర్లు, ఆధార్ నంబర్లు, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని ఎంటర్ చేయాలని అడుగుతారని.. తద్వారా సులువుగా ప్రజల డబ్బును సైబర్ నేరగాళ్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.


మోసపూరితంగా వాట్సాప్, ఎస్సెమ్మెస్ లేదా ఈ-మెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లపై అస్సలు క్లిక్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పర్సనల్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అడిగినా వారితో షేర్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. ఏదైనా ప్రభుత్వ పథకం లేదా సమాచారం గురించి ప్రామాణికత తెలుసుకోవాలనుకుంటే.. సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారిక వెబ్‌సైట్‌లను లేదా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని సంప్రదించాలని సూచించింది.


కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల సబ్సిడీలు, బహుమతులు అందిస్తామంటూ వచ్చే మెసేజ్‌లు నిజమో కాదో చెక్‌ చేయాలనుకుంటే ఆ మెసేజ్ లేదా లింక్‌ లేదా ఫొటోను పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ వాట్సాప్‌ నంబర్‌ 8799711259కు లేదా ఎక్స్‌ అకౌంట్‌ @PIBFactCheck ద్వారా పంపించవచ్చని మరోసారి స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa