ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-పాక్ ఘర్షణలను తన ఆయుధ పరీక్షలకు వాడుకున్న చైనా.. అమెరికా సంచలన నివేదిక

international |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 08:20 PM

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్, పాకిస్థాన్ మధ్య ఈ ఏడాది మేలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలను చైనా తన ఆయుధ సామర్థ్యాన్ని పరీక్షించడానికి, ప్రమోషన్లకు వాడుకుందని అమెరికా ఆరోపించింది. ఈ మేరకు యూఎస్ చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ నివేదిక ప్రచురించింది. భారత్, పాక్ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని తన అత్యాధునిక ఆయుధాలను పరీక్షించడానికి, ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకుందని నివేదిక తెలిపింది. ఇది భారత్‌తో సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, విస్తరిస్తున్న రక్షణ పరిశ్రమ లక్ష్యాలకు ఉపయోగపడుతుందని కూడా చెప్పింది.


‘‘ఈ ఘర్షణలో (భారత్-పాక్) చైనాకి చెందిన ఆధునిక ఆయుధ వ్యవస్థలైన HQ-9 గగనతల రక్షణ వ్యవస్థ, PL-15 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, J-10 యుద్ధ విమానాలు మొదటిసారి ప్రత్యక్ష యుద్ధంలో వినియోగించారు... ఇవన్నీ ఒక నిజమైన ‘ఫీల్డ్ ఎక్స్‌పెరిమెంట్’ లా పనిచేశాయి’ అని నివేదిక పేర్కొంది. అంతేకాదు, ఈ ఏడాది జూన్‌లో 40 ఐదోతరం యుద్ధ విమానాలు జే-35 జెట్లు, కేజే-500 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను పాకిస్థాన్‌కు విక్రయించడానికి చైనా ప్రతిపాదించినట్టు నివేదిక బయటపెట్టింది. ఆయుధాల అమ్మకాలను పెంచుకోడానికి ఘర్షణ జరిగిన కొన్ని వారాల తర్వాత చైనా రాయబార కార్యాలయాలనుతమ ఆయుధ వ్యవస్థల విజయాలను ప్రశంసిస్తూ ప్రచారం చేశాయని నివేదిక వివరించింది.


అంతేకాదు, ఈ ఘర్షణను చైనా ప్రేరేపించిన ‘ప్రాక్సీ వార్’గా నివేదిక అభివర్ణించడం గమనార్హం. అంతేకాదు, రఫేల్ యుద్ధ విమానాలపై తప్పుడు ప్రచారాన్ని చైనా తలకెత్తుకుందని నివేదిక ఆరోపించింది. ‘ఫ్రాన్స్ నిఘా వర్గాల ప్రకారం తన జే-35ఎస్‌ల గురించి గొప్పలు చెప్పుకోడానికి సోషల్ మీడియాలో ఏఐ, వీడియో గేమ్ ఫోటోలతో రఫేల్ యుద్ధ విమానాలపై తప్పుడు ప్రచారం చేసింది. తమ యుద్ధ విమానాలు రఫేల్ జెట్లను కూల్చివేశాయని ఫేక్ ప్రచారం హోరెత్తించింది’ అని ఆరోపించింది. అలాగే, అప్పటికే జరుగుతోన్న రఫేల్ యుద్ద విమానాల డీల్‌ను నిలిపివేసేలా ఇండోనేషియాను చైనా రాయబార కార్యాలయం అధికారులు ఒప్పించారని చెప్పింది.


కాగా, అమెరికా నివేదికను తోసిపుచ్చిన చైనా.. ఇది తప్పుదోవ పట్టించే సమాచారమని మండిపడింది. ‘‘నివేదికను రూపొందించిన కమిషన్ ఎప్పుడూ చైనా పట్ల సిద్ధాంతపరంగా పక్షపాతాన్ని చూపుతుంది. దీనికి విశ్వసనీయత ఏమీ లేదు’’చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa