ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాల నుంచి 215 మంది విద్యార్థుల అపహరణ.. వారంలోనే రెండోసారి

Crime |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 08:30 PM

నైజీరియాలో సాయుధుల కిడ్నాప్‌ల పరంపర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే 25 మంది విద్యార్థులను అపహరించుకెళ్లిన దుండగులు.. తాజాగా 215 మంది చిన్నారులను, 12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. ఇది వారంలో జరిగిన రెండో అపహరణ కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తమైన నైజీరియా సర్కారు 47 కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.


అసలేం జరిగిందంటే?


క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆఫ్ నైజీరియా  ప్రకారం.. నైజర్ రాష్ట్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఈ అపహరణ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి, తుపాకులు చేత పట్టుకుని వచ్చి మరీ పిల్లలను కిడ్నాప్ చేశారు. కేవలం విద్యార్థులనే కాకుండా ఉపాధ్యాయులను సైతం అపహరించారు. మొత్తంగా 215 మంది విద్యార్థులను, 12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. అదృష్టవశాత్తు కొందరు పిల్లలు అపహరణకు గురి కాకుండా తప్పించుకోగలిగారని సీఏఎన్ చైర్మన్ రెవరెండ్ బులుస్ దౌవా యోహన్నా తెలిపారు. అయితే 2024 మార్చిలో కడునా రాష్ట్రంలో 200 మందికి పైగా విద్యార్థులను కిడ్నాప్ చేసినప్పటి నుంచి జరిగిన అతిపెద్ద సామూహిక పాఠశాల అపహరణ.


ఇది మాత్రమే కాకుండా ఈ వారం మొదట్లో కూడా మరో కిడ్నాప్ జరిగింది. సోమవారం రోజు కెబ్బి రాష్ట్రంలోని ఒక బోర్డింగ్ పాఠశాల నుంచి 25 మంది బాలికలను సాయుధులు అపహరించారు. అదే రోజున క్వారా రాష్ట్రంలో ఒక చర్చిపై దాడి చేసి 38 మంది భక్తులను కిడ్నాప్ చేసి.. వారిని విడుదల చేసేందుకు డబ్బులు అడిగారు. ముఖ్యంగా ఒక్కో భక్తుడికి 100 మిలియన్ నైరా (భారత కరెన్సీ ప్రకారం రూ.61,69,348) చొప్పున డిమాండ్ చేసినట్లు చర్చి అధికారులు తెలిపారు.


భద్రతా హెచ్చరికల ఉల్లంఘన


నైజర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దారుణమైన సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దాడులు జరిగే అవకాశం ఉందని ముందస్తు నిఘా సమాచారం ఉన్నప్పటికీ.. సెయింట్ మేరీస్ పాఠశాల, బోర్డింగ్ పాఠశాలలను మూసివేయాలనే ప్రభుత్వ ఆదేశాన్ని విస్మరించింది. దీని కారణంగానే విద్యార్థులు, సిబ్బంది అనవసరమైన ప్రమాదానికి గురయ్యారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పోలీసులు, సైనిక బలగాలు కిడ్నాప్ అయిన వారిని రక్షించేందుకు సమీపంలోని అడవులలో గాలింపు చర్యలు చేపట్టాయి.


నైజీరియాలో భద్రతా సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ఈ దేశంపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా క్రిస్టియన్ల హత్యలను అరికట్టడంలో విఫలమైతే వెంటనే సైనిక చర్య తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ హెచ్చరిక తర్వాత పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్‌సెత్ నైజీరియా జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమై క్రిస్టియన్లపై జరుగుతున్న హింస గురించి చర్చించారు. అయితే నైజీరియా ప్రభుత్వం ట్రంప్ ఆరోపణలను తప్పుడు ప్రచారంగా కొట్టిపారేసింది. మరోవైపు ఈ వారం జరిగిన దాడుల కారణంగా నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు జీ20, ఆఫ్రికన్ యూనియన్-యూరోపియన్ యూనియన్ సమ్మిట్‌లలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా, అంగోలా పర్యటనలను రద్దు చేసుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa