ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖమ్మంలో రూ.500లకే రూ.30 లక్షల ప్లాట్,,,నకిలీ లక్కీ డ్రా నిర్వహిస్తోన్న ముఠా

Crime |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 08:33 PM

ఈమధ్య కాలంలో వెరైటీ లక్కీ డ్రాల గురించి తరుచుగా వింటున్నాం.. చూస్తున్నాం. రూ.1000 కడితే ప్లాట్, వ్యవసాయ భూమి, ఇల్లు ఇలా రకరకాల లక్కీ డ్రాలు నిర్వహించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వీటిల్లో కొన్ని నిజమైనవి అయితే.. అత్యధిక శాతం లక్కీ డ్రాలు జనాలను బురిడీ కొట్టించేవే అంటున్నారు అధికారులు. తాజాగా లక్కీ డ్రా పేరుతో జనాలను మోసం చేసిన 14 మందిని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. లక్కీ డ్రా పేరుతో నిర్వహించే లాటరీలను నమ్మవద్దని సూచించారు. వీటిల్లో అత్యధిక భాగం జనాలను మోసం చేసేవే ఉంటాయన్నారు. ఆ వివరాలు..


ఖమ్మం జిల్లాలో లక్కీ డ్రా పేరు చెప్పి.. స్థిరాస్తి మోసానికి పాల్పడుతున్న 14 మందిని ఖమ్మం ఒకటో టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, సంభానినగర్‌ ప్రాంతంలో ఆలస్యం వినయ్‌కుమార్‌ అనే వ్యక్తి నివాసం ఉండే వాడు. కొన్ని రోజుల నుంచి ఇతడు.. రూ.500లకే రూ.30లక్షల ప్లాటు అంటూ.. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ప్రచారం చేయసాగాడు. అయితే ఇతడు జనాలను బురిడీ కొట్టించడానికే ఇలాంటి ప్రచారం తెర మీదకు తెచ్చాడని పోలీసులు తెలిపారు. అసలేం జరిగిందంటే..


వినయ్ కుమార్.. కొన్నాళ్ల క్రితం.. చింతకాని మండలం, నేరడ గ్రామానికి చెందిన అనూష అనే స్త్రీ వద్ద నుంచి 563 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. రూ.7లక్షలకే వినయ్ ఆ స్థలాన్ని సొంతం చేసుకుని.. ఆపై దాన్ని ఓ ఫైనాన్స్ సంస్థ వద్ద తాకట్టు పెట్టి రూ.20 లక్షల రుణం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ స్థలం భారీ ధర పలుకుతుందని నమ్మించి జనాలను బురిడీ కొట్టించడానికి లక్కీ డ్రా స్కీమ్‌ను తీసుకొచ్చాడు.


2026 సంక్రాంతి మెగా బంపర్‌ డ్రా పేరుతో రూ.500 కడితే రూ.30 లక్షల ప్లాట్ అంటూ 5వేల కూపన్లతో లాటరీ పెట్టాడు. ఒక్క కూపన్ మీద రూ.50లు కమీషన్‌ ఇస్తానంటూ 13 మందిని ఈ లక్కీ డ్రా ప్రచారం కోసం నియమించుకున్నాడు. ఈ వ్యవహారం కాస్త పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వారు రంగంలోకి దిగి.. వినయ్‌తో పాటు, మిగతా 13 మందిని అదుపులోకి తీసుకొన్నారు. వీరి వద్ద నుంచి 27 లక్కీ డ్రా పుస్తకాలు, రసీదులు, నిందితుడి సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa