ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

national |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 08:26 AM

కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు తీవ్రమైన నేపథ్యంలో శనివారం సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో బెంగళూరులో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత సిద్ధరామయ్య మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత అంశాలు, స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చించామని, నాయకత్వ మార్పు ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. సీఎం మార్పు అనేది కేవలం మీడియా సృష్టేనని ఆయన కొట్టిపారేశారు.అయితే, అధిష్ఠానం నిర్ణయమే అంతిమమని సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ చివరికి అధిష్టానం ఏది చెబితే అది మేమంతా అంగీకరించాలి. అది నేనైనా, డీకే శివకుమార్‌ అయినా సరే" అని ఆయన పేర్కొన్నారు. అధిష్ఠానం పిలిచినప్పుడు ఢిల్లీ వెళ్తానని తెలిపారు.ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో, సీఎం పదవిని పంచుకోవాలన్న ఒప్పందం ఉందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల ఢిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని నిఘా వర్గాలు కూడా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఖర్గే సిద్ధరామయ్యను ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు.మరోవైపు, ఈ రాజకీయ సంక్షోభాన్ని ఎన్డీయే తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ కర్ణాటకలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని, కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయని ఆరోపించారు. స్థానిక ఎన్నికల లోపు ఈ ప్రతిష్ఠంభనకు తెరదించాలని, పాలనను గాడిలో పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa