ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వరి రైతులకు గుడ్ న్యూస్.. వరి పంటకు మద్దతు ధర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 07:28 PM

రాష్ట్రంలోని వరి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వరి రైతులు నష్టపోకుండా మద్దతు ధరను నిర్ణయించింది. ఏ గ్రేడ్, సాధారణ రకాలుగా వరి ధాన్యాన్ని విభజించిన ఏపీ ప్రభుత్వం.. వాటికి మద్దతు ధరను నిర్ణయించింది. మద్ధతు ధరకు విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేసింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరిపంట దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే ధాన్యాన్ని రెండు రకాలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వాటికి మద్దతు ధర ప్రకటించింది. గ్రేడ్‌- ఎ రకం వరి ధాన్యం అయితే క్వింటా రూ. 2,389, సాధారణ ధాన్యం అయితే క్వింటా రూ. 2,369కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఇందుకోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. ఈ- క్రాప్ కింద నమోదు చేసుకున్న రైతులు మాత్రమే అర్హులని తెలిపింది. అలాగే రైతులు ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి.


ఇక ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులను రైతులే భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఈ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇక హమాలీలను, గోనె సంచులను ప్రభుత్వం అందిస్తుంది. పౌరసరఫరాల సంస్థ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ రైతులే గోనెసంచులు, హమాలీలను ఏర్పాటు చేసుకుంటే ఆ ఖర్చును ప్రభుత్వం అదనంగా చెల్లిస్తుంది. ఇక వరి ధాన్యంలో ఇసుక, మట్టి, రాళ్లు వంటివి ఒక శాతానికి మించి కూడా ఉండకూడదు. రంగుమారిన ధాన్యం, మొలకెత్తిన గింజలు వంటివి ఐదుశాతానికి మించకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించింది.


మరోవైపు ఆధునిక సాంకేతికతను వినియోగించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. రైతు ఫోన్‌ నుంచి వాట్సప్‌లో 7337359375 నంబరుకు హాయ్‌ అనే మెసేజ్ పంపి.. ధాన్యం అమ్ముకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. హాయ్‌ అంటూ వాట్సాప్ మెసేజ్ పంపగానే పౌరసరఫరాల శాఖ అధికారులు బదులిస్తారు.ఎన్ని బస్తాల ధాన్యం ఉంది.. ఏ రకం.. ఎగుమతికి ఎన్ని రోజులు పడుతుంది వంటి సమాచారం అందించాల్సి ఉంటుంది. అలాగే సమీప కొనుగోలు కేంద్రంతో పాటుగా రైస్‌ మిల్లు ఊరు, పేరుతో పాటు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. దీంతో రైతులు సులభంగా తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని అధికారులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa