ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రైమ్ థ్రిల్లర్ తలదన్నే స్టోరీ.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?

Crime |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 07:32 PM

నేటి సమాజంలో నిత్యం ఎన్నో నేరాలు, ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. మన చుట్టూ రోజూ ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని ఘటనలను చూస్తే.. సినిమా స్టోరీలకు ఏ మాత్రం తీసిపోవనిపిస్తుంది. క్షణికావేశంలో తప్పులు చేయటం.. ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు.. ఈ తప్పుల పరంపరకు ఇక అంతం అంటూ ఉండదు. ఈ క్రమంలోనే నేరాలకు పాల్పడటం.. అందులో నుంచి బయటపడటానికి సరికొత్త కథను అల్లడం.. ఈ మధ్యకాలంలో సాధారణంగా మారుతోంది. గుంటూరు జిల్లా తెనాలిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి మూడో వ్యక్తిని ఇరికించేందుకు చేసిన ప్రయత్నం విఫలమై.. గూగుల్ లొకేషన్ వారిని పోలీసులకు పట్టించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..


తెనాలి వన్ టౌన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన ఉష అనే మహిళ.. అభిప్రాయ భేదాలు రావటంతో భర్త నుంచి 15 ఏళ్లుగా విడిగా ఉంటోంది. ఉష గతంలో తెనాలిలోనే ఓ హోటల్‌లో పనిచేసేది. ఆ సమయంలో ఆమెకు విజయ్ అనే టీ మాస్టర్ పరిచయమయ్యాడు. అప్పటికే అతను కూడా భార్యతో విడిపోయి ఉండటంతో.. వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. సహజీవనం ప్రారంభించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ హోటల్‌ మూతపడింది. దీంతో ఉష, విజయ్.. 2021లో నందిగామకు మకాం మార్చారు. అక్కడే మరో హోటల్‌లో పనికి కుదిరారు. అయితే ఇదే సమయంలో ఉష మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అతనికి సన్నిహితంగా ఉండటంతో విజయ్‌ దానిని తట్టుకోలేకపోయాడు. ఉషను గాయపరిచి.. అలాగే ఆ వ్యక్తిని కూడా చంపేశాడు. ఈ కేసులో విజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ కట్ చేస్తే..


నందిగామ ఘటన తర్వాత.. ఉష తిరిగి తన మకాం తెనాలికి మార్చింది. అక్కడే ఉంటోంది. ఇక హత్య కేసులో అరెస్టైన విజయ్.. జైలు నుంచి విడుదలయ్యాడు. మళ్లీ ఉష వద్దకు చేరాడు. ఆమెకు మాయమాటలు చెప్పి.. మంచి చేసుకున్నాడు. ఆమెతో కలిసి తెనాలిలో ఉంటున్నారు. అయితే ఇంత జరిగినా ఉష పద్ధతి మార్చుకోలేదు. అభిషేక్ అనే హైదరాబాద్ వ్యక్తితో కొన్ని నెలల కిందట ఉష పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలోనే తాను అభిషేక్‌తో ఉంటానంటూ ఉష ఇటీవల విజయ్‌కు తెగేసి చెప్పింది. దీంతో విజయ్ కోపం పెంచుకున్నాడు. శుక్రవారం రోజు అర్ధరాత్రి వేళ.. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంలో విజయ్.. ఉషను కత్తితో పొడిచాడు.


మూడో వ్యక్తిని ఇరికించే ప్లాన్..


అయితే గాయపడిన ఉషను చూసిన విజయ్.. మరో దుర్మార్గపు ప్లాన్ వేశాడు. కత్తితో దాడి చేసింది అభిషేక్‌ అని పోలీసులకు చెప్తే ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో ఉష అందుకు అంగీకరించింది. వెంటనే తెనాలి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పోలీసులు ఈ ఘటనపై తెనాలి ఆస్పత్రికి వెళ్లి వారిని విచారించారు. ఈ సమయంలో దాడి చేసింది అభిషేక్ అంటూ బదులిచ్చారు. దీంతో అభిషేక్‌ను గుర్తించేందుకు పోలీసులు అతని ఫోన్ లొకేషన్ ట్రేస్ చేశారు. అయితే అభిషేక్ గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు గుర్తించారు.దీంతో పోలీసులకు ఎందుకో అనుమానం కలిగింది.


ఈ అనుమానంతోనే ఘటన జరిగిన ఇంటిని పోలీసులు తనిఖీచేశారు. అక్కడి వారితో మాట్లాడారు. ఈ సమయంలోనే ఉష తల్లితో మాట్లాడగా.. ఆమె అసలు సంగతి చెప్పింది. శుక్రవారం రాత్రి ఇద్దరూ గొడవపడ్డారని, విజయ్ కోపంతో ఉషను కత్తితో పొడిచాడని చెప్పింది. దీంతో పోలీసులు విజయ్ లొకేషన్ చెక్ చేయగా.. ఘటన జరిగిన సమయంలో అతను అక్కడే ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ కేసులో అతడే నిందితుడని గుర్తించి, పోలీసులు విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉష ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa