కుల ఆధారిత రిజర్వేషన్లలో అత్యంత కీలకమైన క్రీమీ లేయర్ అంశంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉప వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తన వంతు కృషి చేసిందని.. ఇక దీనిపై తదుపరి అడుగు వేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. సోమవారం పదవీ విరమణ చేయనున్న ఆయన.. మీడియాతో ముచ్చటిస్తూ న్యాయవ్యవస్థ, కొలీజియం, తన భవిష్యత్ కార్యాచరణపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
క్రీమీ లేయర్, రిజర్వేషన్లు
గతేడాది ఎస్సీ, ఎస్టీలలో ఉప వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులో జస్టిస్ బీఆర్ గవాయ్ భాగస్వామిగా ఉన్నారు. దేశంలో అత్యున్నత న్యాయపీఠాన్ని అధిరోహించిన రెండో దళిత న్యాయమూర్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సందర్భంగా సమానత్వం అందరికీ చేరాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఉన్నత స్థానాలకు చేరిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఇంకా రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారని.. దీనివల్ల ఆయా వర్గాల్లోని నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
రిజర్వేషన్ల ప్రయోజనం అట్టడుగు వర్గాలకు చేరాలంటే.. క్రీమీ లేయర్ను గుర్తించి వారిని మినహాయించేలా కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడే నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని.. ఈ విషయంలో న్యాయవ్యవస్థ తన పని చేసిందని.. ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉందని పేర్కొన్నారు.
బంధుప్రీతి ఆరోపణలపై సమాధానం
న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థలో బంధుప్రీతి ఉందన్న విమర్శలను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్రంగా ఖండించారు. కొలీజియం ముందు వచ్చే పేర్లలో న్యాయమూర్తుల బంధువుల పేర్లు 10 శాతం కూడా ఉండవని తెలిపారు. కేవలం ఒక జడ్జికి బంధువు అయినంత మాత్రాన.. అర్హత ఉన్న వారిని పక్కన పెట్టలేం కదా అని ప్రశ్నించారు. మెరిట్ ఉన్నవారికి అవకాశం దక్కాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటేనే స్వతంత్రమా?
న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి గురించి మాట్లాడిన జస్టిస్ బీఆర్ గవాయ్.. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తేనే ఒక న్యాయమూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కాదని వెల్లడించారు. అది ఒక తప్పుడు భావన అని అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల బదిలీలు కేవలం పరిపాలనాపరమైన కారణాలతోనే జరుగుతాయని వివరించారు.
షూ విసిరిన వ్యక్తిని క్షమించా
ఇటీవల సుప్రీంకోర్టు హాల్లో విచారణ జరుగుతుండగా ఒక న్యాయవాది తనపైకి షూ విసిరన ఘటనను ఈ సందర్భంగా సీజేఐ గవాయ్ గుర్తు చేసుకున్నారు. క్షమించడం తనకు సహజంగా అలవడిన గుణమని.. అందుకే ఆ క్షణమే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
భవిష్యత్ ప్రణాళిక
సీజేఐగా పదవీ విరమణ చేసిన తర్వాత తాను విశ్రాంతి తీసుకుంటానని జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం సామాజిక సేవ చేస్తానని వెల్లడించారు. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం ఇచ్చే ఏ పదవినీ స్వీకరించనని ఆయన స్పష్టంగా ప్రకటించారు. జస్టిస్ గవాయ్ పదవీ విరమణ తర్వాత.. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa