ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రఫేల్ కూల్చామంటూ పాక్ మీడియా కారు కూతలు,,,,చెంప చెల్లుమనేలా ఫ్రాన్స్ సమాధానం

international |  Suryaa Desk  | Published : Sun, Nov 23, 2025, 08:34 PM

ఆపరేషన్ సిందూర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా.. తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు పాకిస్తాన్. ఇంకా తప్పుడు ప్రచారంతో విషం కక్కుతూనే ఉంది. ఇటీవల మళ్లీ ఆపరేషన్ సిందూర్‌లో గగనతలంలో పాకిస్తాన్‌ పైచేయి సాధించిందని విష ప్రచారం మొదలుపెట్టింది. అంతేకాకుండా భారత్‌ రఫేల్‌ జెట్లు కోల్పోయిందంటూ ఫ్రాన్స్‌ నౌకాదళ అధికారిని ఉటంకిస్తూ పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈసారి పాక్ చెంప చెల్లుమనేలా.. ఫ్రాన్స్ సమాధానం ఇచ్చింది. పాక్ ప్రచారాన్ని ఖండించింది. ఫేక్‌ న్యూస్‌గా పేర్కొంది.


కింద పడినా పైచేయి నాదే అనడంలో పాకిస్తాన్ దిట్ట. ఆపరేషన్ సిందూర్ సమయంలో వైమానిక దాడుల్లో పాకిస్తాన్‌ ఆధిపత్యాన్ని చెలాయించిందని ఇటీవల పాక్ మీడియా సంస్థ జియో టీవీ కథనం ప్రచురించింది. యుద్ధ కార్యకలాపాల విషయంలో పాక్ మెరుగ్గా సన్నద్ధమైనందునే.. రఫేల్ యుద్ధ విమానం కూలిపోయింది.. చైనా జే-10సీ యుద్ధ విమానాల సాంకేతిక సామర్థ్యం వల్ల కాదంటూ.. ఫ్రాన్స్‌ నేవీ అధికారి కెప్టెన్ జాక్విస్ లానే చెప్పారని కథనంలో పేర్కొంది. అయితే ఇదంతా తప్పుడు సమాచారమని ఫ్రాన్స్‌ నౌకాదళం కొట్టిపారేసి.. ఫేక్‌ న్యూస్‌గా అభివర్ణించింది.


చెంప చెల్లుమనేలా..


జియో న్యూస్ కథనంలో ఉన్నది మొత్తం తప్పుడు సమాచారం అని.. అసలు ఆ ఫ్రెంచ్ అధికారి ఎవరితో మాట్లాడలేదని ఫ్రాన్స్ క్లారిటీ ఇచ్చింది. ఆ కథనంలో చెప్పినట్లు కాకుండా.. ఆయన కేవలం ఓ నేవీ ఎయిర్‌ స్టేషన్‌ అధికారి మాత్రమే అని పేర్కొంది. పాక్ మీడియా ప్రచారంలో పెద్ద మొత్తంలో తప్పుడు సమాచారం ఉందని చెప్పింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది.


పాకిస్తాన్‌ మీడియా భారత వ్యతిరేక ప్రచారంపై నెట్టింట పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ.. ఈ వ్యవహారం పాక్‌ తప్పుడు సమాచార యంత్రాంగానికి నిదర్శనం అని అన్నారు. ఆ జియో టీవీ కథనంలో.. హమిద్ మిర్ అవే పాత, కల్పిత వాదనలను చెప్పారని.. ఇప్పుడు వాస్తవాలు బహిర్గతమయ్యాయని చెప్పారు. దురదృష్టవశాత్తు హమిద్ మిర్‌కు భారత్‌లో స్నేహితులు ఉన్నారని.. వారిని గుర్తించండి అంటూ చెప్పారు.


జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు విచక్షణా రహింతగా కాల్పులు జరిపి.. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల పాటు పాకిస్తాన్‌పై భీకర దాడులు చేసింది. దీంతో కాళ్లబేరానికి వచ్చిన పాకిస్తాన్.. కాల్పుల విరమణ చేయాలని కోరింది. ఇప్పుడు మళ్లీ తాము పైచేయి సాధించామనంటూ బీరాలు పలుకుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa