ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వానికి మావోయిస్టుల బహిరంగ లేఖ

national |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 05:24 PM

మావోయిస్టులపై సీరియస్ గా దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలోగా మావోయిస్టులను ఏరివేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా భద్రతా బలగాలతో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ మావోయిస్టులకు లొంగిపోవాలని సూచించింది. ఇటీవల జరిగిన పలు ఎన్ కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలు మరణించిన విషయం తెలిసిందే. పలువురు మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టి ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలన్న ప్రభుత్వ సూచనపై ఈ లేఖలో సానుకూలంగా స్పందించారు.అయితే, ఆయుధాలు వదిలేందుకు తమకు కొంత సమయం కావాలని, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం ఇస్తే లొంగిపోతామని పేర్కొన్నారు. అప్పటి వరకు కూంబింగ్ ఆపరేషన్లను ఆపేయాలని, అడవులను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలను వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూంబింగ్ ఆపరేషన్లు వెంటనే నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. కూంబింగ్‌ ఆపరేషన్‌ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈమేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌(ఎంఎంసీ) స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి అనంత్‌ పేరిట బహిరంగ లేఖ విడుదలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa